క్విట్ ఏపీ అని  బాబును.. క్విట్ మంగళ గిరి అని లోకేష్‌ని తిప్పి పంపించారు 

వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి
 

విశాఖపట్నం: క్విట్ ఏపీ అని చంద్రబాబును.. క్విట్ మంగళ గిరి అని లోకేష్‌ని  ప్ర‌జ‌లు తిప్పి పంపించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్ కో-ఆర్డినేట‌ర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వైయ‌స్ఆర్ సీపీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం శనివారం విశాఖపట్నంలోని పోర్టు కళావాణి స్టేడియంలో జరిగింది. సమావేశంలో టీటీడీ ఛైర్మన్‌, ఉమ్మడి విశాఖ జిల్లా కో ఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఈ రోజు ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారంటే అది వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తల సహకారమేనని అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో రాష్ట్రం అదోగతి పాలైందన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు గుర్తించి మానిఫెస్టోలోని 98 శాతం అమలు చేశారు. అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్‌ సీఎంవైయ‌స్  జగన్‌ పాలనలో స్పష్టంగా కనిపిస్తోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

'సీఎం వైయ‌స్ జగన్‌ కరోనా సమయంలో కూడా ఆర్థిక భారం ప్రజలపై పడకుండా కాపాడారు. మూడేళ్లు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చూసి నిద్రపోయిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు బయటకు వచ్చారు. చంద్రబాబు అధికారంలో ఉంటే తోడుగా కరువు తెస్తారు. చంద్రబాబు ది ఐరెన్ లెగ్. గతంలో చంద్రబాబు గద్దె ఎక్కిన వెంటనే విశాఖకు హుద్‌హుద్‌ తుఫాన్ తెచ్చారు. చంద్రబాబు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా మంచి పనులు చేశారా.  మే 11 నుంచి గడప గడకు కార్యక్రమం మొదలవుతుంది. మూడేళ్ల జగన్ పాలనలో అందిన ఫలాలు ప్రజలకు వివరించాలి. రానున్న రోజుల్లో విశాఖ జిల్లా వైయ‌ర్‌సీపీ వశం ఖాయం. జెండా మోసిన ప్రతి వ్యక్తికి వైయ‌స్సార్‌సీపీలో గుర్తింపు ఉంటుంది' అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 

ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఇంఛార్జి మంత్రి విడదల రజనీ, విశాఖ జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వంశీ కృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, విశాఖ ఎంపీ ఎం.వి.వి సత్య నారాయణ, మేయర్ హరి వెంకట కుమారి, జెడ్పీ ఛైర్మన్‌ జల్లిపల్లి సుభద్ర హాజరయ్యారు. 

Back to Top