తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చి మా పొట్ట కొట్టిందని, ఉపాధి కల్పించి మీరే ఆదుకోవాలంటూ ఎండీయూ యూనియన్ నేతలు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఉపాధి అవకాశం కోల్పోయిన మరో వర్గం రేషన్ సరుకులను ఇంటి వద్దనే డెలివరీ చేసే ఎండీయూ (మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్)ల నిర్వాహకులు. జూన్ 1 నుంచి ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థకు స్వస్తి చెప్పాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయంతో 18 వేలకు పైగా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీనిపై ఇప్పటికే రాష్ట్రంలో పలు చోట్ల ఆందోళన చేస్తున్న ఎండీయూల యూనియన్ సభ్యులు, మళ్లీ తమను ఆదుకోవాలంటూ మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ను కలిసిన వారి వినతి పత్రం ఇచ్చారు. ‘పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేసిన మీరు అందరి జీవితాల్లో మార్పు కోసం కృషి చేశారు. వాటిలో మీరు ప్రవేశపెట్టిన ఇంటింటికీ రేషన్ పంపిణీ వ్యవస్థ అన్నింట్లో మిన్నగా నిల్చింది. ఈ వ్యవస్థ మాకు ఉపాధి కల్పించడమే కాకుండా.. దివ్యాంగులు, వృద్థులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లోని వారు, మారుమూల ప్రాంతాల్లోని వారు, రేషన్ సరుకుల కోసం ఏ ఇబ్బంది పడకుండా చేసింది. వారు రేషన్ సరుకుల కోసం రోజుల తరబడి రేషన్ షాపుల చుట్టూ తిరగడం, ఆ షాపుల వద్ద క్యూ కట్టాల్సిన అవసరం లేకుండా.. ఇంకా కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం, వాగులు, వంకలు దాటుకుని రావాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే వారికి రేషన్ అందింది. కానీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను రద్దు చేయడం వల్ల ఎండీయూలు ఉన్న 9260 కుటుంబాలతో పాటు, వారికి సహాయకులుగా ఉన్న మరో 9260 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాబట్టి, మీరు తిరిగి అధికారంలోకి రాగానే, ఈ వ్యవస్థను తిరిగి ప్రారంభించి, మాకు ఉపాధి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము’.. అని ఎండీయూల యూనియన్ ప్రతినిధులు ఆ వినతిపత్రంలో శ్రీ వైయస్ జగన్ను కోరారు