తాడేపల్లి: గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు, ప్రముఖ కాపు నాయకుడు గూడపాటి శ్రీనివాసరావు తన అనుచరులతో సహా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వందలాది మంది అభిమానులతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ సమక్షంలో వైయస్ఆర్సీపీలో చేరారు. ఆయనకు స్వయంగా కండువా కప్పిన శ్రీ వైయస్ జగన్, పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీ వైయస్ జగన్ మాట్లాడుతూ, జీఎస్ (గూడపాటి శ్రీనివాసరావు) అన్నతో పాటు, ఎవరైతే ఆయన సహచరులంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతున్నారో.. మీ అందరినీ కూడా సాదరంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నాను. అదే విధంగా జీఎస్ అన్నను కూడా గుండెల్లో పెట్టుకుంటాను. ఆయన కూడా అన్ని రకాలుగా మంచి చేస్తాడని కచ్చితంగా చెప్పగలుగుతాను. మీరందరూ రావడం సంతోషం. నియోజకవర్గంలో మోహన్ను తమ్ముడిగానే భావించి, రాబోయే ఎన్నికల్లో గెలిపించే దిశగా మీరంతా కూడా అడుగులు వేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జీఎస్ అన్న రాకతో, రేపల్లెలో.. మరీ ముఖ్యంగా పట్టణంలో పార్టీ మరింతగా బలపడుతుందని ఆశిస్తున్నానని శ్రీ వైయస్ జగన్ అన్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని వెంకట్రామయ్య (నాని), రేపల్లె నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్ పీటా నాగమోహనకృష్ణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డితో పాటు, పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.