చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా ఏం చేయలేరు

మరోసారి వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం

  ఊద కర్రతో నడిచే చంద్రబాబు రాజకీయంగా నిలబడలేరు

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

  చిత్తూరు: చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. వైయ‌స్ఆర్‌ సీపీని ఏం చేయలేరని మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అన్నారు. మరోసారి వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్య‌క్తం చేశారు.  కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు గంటసేపు చర్చలు జరిపారని.. ఊద కర్రతో నడిచే చంద్రబాబు రాజకీయంగా నిలబడలేరని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వైయ‌స్ఆర్‌ సీపీ విజయోత్సవ మహాసభను నిర్వహించారు. సీఎం వైయ‌స్ జగన్ నాలుగు సంవత్సరాల సుపరిపాలన, గడప గడపకు మన ప్రభుత్వం దిగ్విజయంగా పూర్తిచేసిన సందర్భంగా ఈ మహాసభను ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రెండు పేజీల మేనిఫెస్టోతో వచ్చిన వైయ‌స్ జగన్, ఆ హామీలన్నీ నెరవేర్చారని చెప్పారు. 2014లో టిడిపి మేనిఫెస్టో ఏం చేశారో అందరికీ తెలుసని అన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా, మేనిఫెస్టోను వెబ్‌సైట్ నుండి కూడా తొలగించిన ఘనత టీడీపీది అని విమర్శించారు. తమ వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తామని ఎన్నోసార్లు చెప్పారని.. 2019లో ఎలా విజయం సాధించామో, అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా నడిచే పరిస్థితిలో చంద్రబాబు లేకపోవడం వల్లే.. నాలుగైదు పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు ఆయన వెంపర్లాడుతున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. వైయ‌స్ఆర్‌ సీపీని ఏం చేయలేరని, మరోసారి వైయ‌స్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు.

 పాత అబద్ధపు హామీలతో కొత్త అబద్ధపు హామీలు కలిపి, టీడీపీ మేనిఫెస్టోని చంద్రబాబు విడుదల చేశారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 100 పేజీలో మేనిఫెస్టోలో 600 హామీలు ఇచ్చారని, కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌ సీపీ సంక్షేమ పథకాలను ప్రవేశపెడితే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చంద్రబాబు విమర్శించారని.. వైయ‌స్ఆర్‌సీపీ కేవలం రెండు పేజీల మేనిఫెస్టోతో వచ్చి 98.44 శాతం హామీలు నెరవేర్చిందని పేర్కొన్నారు. ఇకపై టీడీపీ కార్యకర్తలు మేనిఫెస్టోతో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడతారని.. రాష్ట్రంలో ఎవరెన్ని కుట్రలు పన్నినా సీఎం వైయ‌స్ జగన్ గతంలో కంటే అధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని చెప్పుకొచ్చారు.

Back to Top