2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేద్దాం

పార్టీ కోసం సైనికుల్లా పనిచేసి.. మళ్లీ అధికారంలోకి తీసుకొద్దాం

గడప గడపకూ వెళ్లి సంక్షేమ, అభివృద్ధి పాలనను వివరిద్దాం 

ఈనెల 7, 8 తేదీల్లో వైవీ సుబ్బారెడ్డి పర్యటనను విజయవంతం చేయాలి

విశాఖ జిల్లాస్థాయి సమావేశంలో పార్టీ జిల్లా అధ్య‌క్షులు అవంతి, మంత్రి అమర్‌నాథ్‌

విశాఖపట్నం: 2024 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైయస్‌ఆర్‌ సీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని విశాఖ జిల్లా వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపునిచ్చారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో  వైయస్‌ఆర్‌ సీపీ జిల్లాస్థాయి సమావేశానికి మాజీ మంత్రి, విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు అవంతి శ్రీనివాస్‌తో కలిసి మంత్రి అమర్‌నాథ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు అవంతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరకు పార్టీలు కూడా చూడకుండా, ఎలాంటి అవినీతి, వివక్షకు తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.1.35 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించామన్నారు. ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో గడప గడపకూ కార్యక్రమంలో పాల్గొనాలని, గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించాలని సూచించారు. గడప గడపకూ తిరిగి.. సంక్షేమ, అభివృద్ధి పాలన గురించి ప్రజలకు వివరించాలన్నారు. 

కష్టపడి పనిచేద్దాం.. మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మాట్లాడుతూ.. పార్టీని బలోపేతం చేసుకొని 2024లో వైయస్‌ జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తలందరిపై ఉందన్నారు. ఏ స్థానంలో ఉన్నా.. అందరం కలిసి కార్యకర్తల్లా పనిచేద్దామని, పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. ఈనెల 7, 8 తేదీల్లో విశాఖ, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి పర్యటన ఉందని, ఈ పర్యటనను విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. 
 

Back to Top