విశాఖపట్నం: మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతి లేదని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఒడిశా అనుమతి ఇచ్చినా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్తో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూముల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈనెల 25న భూ పట్టాల పంపిణీకి కసరత్తు జరుగుతుందని వెల్లడించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. సీఎం వైయస్ జగన్ ముందు టీడీపీ మైండ్ గేమ్లు పనిచేయవన్నారు. విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మాజీలు భూ కబ్జాలకు పాల్పడి.. వైయస్సార్సీపీ నాయకులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నిజం చెబితే చంద్రబాబుకు శాపం కాబోలు అన్నీ అబద్దాలే చెబుతున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ దుయ్యబట్టారు.