వెన్నుపోటు కూటమి కుట్ర‌ల‌ను భూస్థాపితం చేద్దాం 

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి పిలుపు 

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన నాయీ బ్రాహ్మణుల స‌మావేశంలో మాట్లాడిన పార్టీ రాష్ట్ర  కో ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి గారు. 

ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ర‌మేశ్ యాద‌వ్‌, వైయ‌స్ఆర్‌సీపీ ఎస్ఈసీ సభ్యుడు సిద్దవటం యానాదయ్య, వైయ‌స్ఆర్‌సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం అధ్యక్షుడు పి.పుల్లయ్య, నాయీ బ్రాహ్మణ విభాగం నాయకులు నూకరాజు, కనకారావు, శ్రీనివాసులు, కోటేశ్వరరావు, మల్లేశ్వరరావు, ధనవిజయుడు తదితరులు పాల్గొన్నారు.

నాయీ బ్రాహ్మ‌ణుల‌ను రాజ‌కీయంగా ప్రోత్స‌హించింది వైయ‌స్ జ‌గ‌నే

కులానికి టీటీడీ బోర్డులో స్థానం క‌ల్పించ‌డం చ‌రిత్ర‌లో మొద‌టిసారి

ఆల‌య పాల‌క‌మండ‌ళ్ల‌లో చోటు, ఆలయాల్లో ఉద్యోగులుగా గుర్తింపు 

రూ. 20 వేల జీతాన్ని ఖరారు చేసి నాయీ బ్రాహ్మ‌ణుల‌కు ఉద్యోగ భద్రత

150 యూనిట్ల వ‌ర‌కు ఉచిత విద్యుత్, ఏఎంసీ చైర్మ‌న్లుగా అవ‌కాశం  

క‌రోనాలో ఒక్క బ‌ట‌న్‌తో రూ. 50 కోట్లు నిధులు విడుద‌ల‌

వైయ‌స్ జ‌గన్ గారి మేలును ఎప్ప‌టికీ మ‌రిచిపోలేం 

మ‌ళ్లీ వైయ‌స్ జ‌గ‌న్‌ని సీఎం చేసుకునేదాకా క‌లిసిక‌ట్టుగా ప‌నిచేద్దాం 

అక్ర‌మ కేసుల‌తో వేధిస్తున్న వెన్నుపోటు కూట‌మికి బుద్ధి చెబుతాం

స‌మావేశంలో నాయీ బ్రాహ్మ‌ణ సంఘం నాయ‌కుల ప్ర‌తిజ్ఞ‌ 

వెన్నుపోటు కూట‌మి అస‌త్య ప్ర‌చారాల‌ను తిప్పికొట్టండి 

పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి 

తాడేపల్లి: ఒక పద్ధతి ప్రకారం గ్రామ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసి, క్షేత్ర స్థాయి నాయకులతో కేంద్ర కార్యాలయాన్ని అనుసంధానం చేస్తూ కంప్యూటరీకరణ పూర్తి చేశాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ పార్టీ కమిటీల్లో నాయీ బ్రాహ్మణులు మాత్రమే దాదాపు 10వేల మంది ఉన్నారని స్పష్టమైన డేటా మన వద్ద ఉంది. వైయ‌స్ఆర్‌సీపీ ప్రధాన విభాగాలు, కమిటీల కీలక స్థానాల్లో 10వేల మంది నాయీ బ్రాహ్మణులు ఉండటం మనం గర్వించదగిన విషయం. రాష్ట్రవ్యాప్తంగా బీసీలందరినీ పరిగణనలోకి తీసుకుంటే దాదాపు 13 నుండి 14 లక్షల మంది నాయకత్వం వైఎస్సార్‌సీపీ నిర్మాణంలో ఉంది. మన పార్టీ నిర్మాణంలోనూ, వ్యవస్థలోనూ బీసీలు అత్యధికంగా 60 శాతానికి పైగా ఉన్నారు. జగన్ గారి నాయకత్వంలో వెనుకబడిన వర్గాలు, దళితులు తమ జనాభా ప్రాతిపదికన పార్టీలోనూ, పాలనలోనూ తగిన ప్రాధాన్యత పొందారు. గతంలో మాదిరిగా ప్రతి చిన్న దానికి రోడ్లపై ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేకుండా, మన అభిప్రాయాలను నేరుగా లీడర్‌షిప్ దృష్టికి తెచ్చేలా కమ్యూనికేషన్ పెంచాం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధాలు, మోసపు హామీలను తిప్పికొట్టడానికి మీరు, మీ పిల్లలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైతన్యపరచాలి. జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో 15–20 ఏళ్ల అభివృద్ధిని, సంక్షేమాన్ని ఆదర్శప్రాయంగా అందించి చూపించారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లలోనే రాష్ట్రాన్ని 3 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టి, అబద్ధాలతో ఘోరమైన పరిస్థితి తెచ్చింది. వెన్నుపోటు కూటమి నేతలు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నిన్న ముస్తఫా కొడుకుపై కిడ్నాప్ కేసు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారిపై అక్రమ కేసులు పెట్టడమే ఇందుకు నిదర్శనం. 

తప్పుడు విచారణలు, ఫేక్ అకౌంట్లు, ఫేక్ ఛానళ్లతో చంద్రబాబు నాయుడు సమాజంలో అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. డీఎస్సీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉచిత విద్యుత్ వంటి అంశాలపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వెన్నుపోటు కూటమి వైఖరిని మీరు ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టాలి. రైతులకు ఉచిత విద్యుత్, బీమా సౌకర్యం అందించిన జగన్ గారి వైఖరి ఒకటైతే, చంద్రబాబు రైతులకు బీమా లేకుండా మోసం చేశారు. మీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి కుటుంబంలోకి జగన్ గారి సందేశాన్ని, ఆయన అందించిన సంక్షేమాన్ని నేరుగా తీసుకెళ్లాలి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని మళ్లీ విజయతీరాలకు చేర్చడమే మన ప్రధాన లక్ష్యం కావాలి. చంద్రబాబు, వెన్నుపోటు కూటమి పార్టీల వెనుక ఉన్న అసత్య ప్రచారాలను శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరి పనితీరును, వారి డేటాను కేంద్ర కార్యాలయం ద్వారా ఏఐ టెక్నాలజీతోనూ పరిశీలిస్తున్నాం. రాబోయే రోజుల్లో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి భవిష్యత్తులో వైఎస్సార్‌సీపీలో తగిన గుర్తింపు, ఉన్నత పదవులు లభిస్తాయని హామీ ఇస్తున్నాను.

తోక‌లు క‌త్తిరిస్తాన‌న్న చంద్ర‌బాబు అధికారాన్ని క‌త్తిరించారు
- లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ

మానవ జీవితంలో పుట్టుక నుంచి మరణం వరకు ప్రతీ మ‌జిలీలోనూ నాయీ స‌మాజానికి నాయీ బ్రాహ్మ‌ణుల తోడు కావాల్సిందే. నాయీ బ్రాహ్మ‌ణుల ప‌ట్ల జగన్ గారికి విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి. నాడు దివంగత మ‌హానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లే ఈనాడు నాయీ బ్రాహ్మణుల ఇళ్లలోని పిల్లలు ఉన్నత చదువులు చదివి ఇంజనీర్లు, డాక్టర్లు కాగలిగారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని విధంగా, దేశంలోనే తొలిసారిగా జగన్ గారు నాయీ బ్రాహ్మణుడిని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్‌గా చేసి చరిత్ర సృష్టించారు. కేవలం టీటీడీ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రతీ దేవాలయ పాలక మండలి కమిటీలో నాయీ బ్రాహ్మణులకు సభ్యత్వం కల్పించి, మీరు ఇతర వద్ద ఆశించే పరిస్థితి నుంచి మీరే నిర్ణయాలు తీసుకునే స్థాయికి గౌరవాన్ని పెంచారు. గతంలో చంద్రబాబు 'తోకలు కత్తిరిస్తాం' అని నాయీ బ్రాహ్మ‌ణుల్ని అవమానిస్తే, అదే నాయీ బ్రాహ్మణులు తమ కత్తెరలతో చంద్రబాబు అధికారాన్నే కత్తిరించి 2019లో బుద్ధి చెప్పారు. 

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాడులు, అక్రమ కేసులతో వేధిస్తోంది. మన ఉచిత విద్యుత్, సంక్షేమాన్ని పక్కన పెట్టి నాయీ బ్రాహ్మణులను మళ్లీ ఆర్థికంగా దెబ్బతీసే కుట్రలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ కమిటీల్లో మన పార్టీ తరఫున దాదాపు 10,000 మంది నాయీ బ్రాహ్మణ సోదరులు ఉన్నారు; మీ షాపులకు రోజూ వచ్చే పదిమందికి జగన్ గారు చేసిన మేళ్లను చెప్పగల గొప్ప ప్రచారకర్తలు మీరు. నేను కూడా ఏ రాజకీయ నేపథ్యం లేని సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి జగన్ గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీనయ్యాను; మన పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకూ తగిన గుర్తింపు, పదవులు లభిస్తాయి. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ, 2029లో మళ్లీ జగన్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా మనమందరం కంకణబద్ధులై పనిచేద్దాం.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అసలైన బలం, బలగం బీసీలే 
- రమేష్ యాదవ్, ఎమ్మెల్సీ, వైయ‌స్ఆర్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు 

సుమారు 130 కి పైగా ఉన్న బీసీ కులాలను దగ్గరకు తీసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రతి కార్పొరేషన్ కూ ఒక ఛైర్మన్ ను, 10 నుండి 12 మంది డైరెక్టర్లను నియమించిన గొప్ప నాయకుడు జగన్ గారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లు నామమాత్రంగా పెట్టి నిధులు ఇవ్వకపోగా, జగన్ గారు మాత్రం ఒకే సంతకంతో 56 కార్పొరేషన్ ఛైర్మన్లకు, ఎందరో కార్యకర్తలకు పదవులు ఇచ్చి అగ్రతాంబూలం అందించారు. గతంలో కోట్లు ఖర్చు పెడితే తప్ప దక్కని టీటీడీ బోర్డు మెంబర్ పదవిని, సాధారణ కార్యకర్త అయిన యానాదయ్య గారికి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ఘనత మన జగన్ గారిదే. గతంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు బీసీల వెన్నుముక విరిస్తే, 2019-24 మధ్య జగన్ గారు బీసీలను రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వెన్నుదన్నుగా నిలిచారు. సామాన్య కడప జిల్లా యాదవ కులానికి చెందిన నాలాంటి ఒక చిన్న కార్యకర్తను కూడా గుర్తించి, మొదటిసారిగా శాసనమండలికి (ఎమ్మెల్సీగా) పంపిన మహోన్నత వ్యక్తి జగన్ గారు. కులం, మతం, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందించిన జగన్ గారి పాలనలో, పెన్షన్ల సంఖ్యను 30 లక్షల నుండి ఏకంగా 66 లక్షలకు పెంచడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీలిచ్చి గెలిచిన కూటమి ప్రభుత్వం, ఈరోజు ఉన్న పోస్టులను భర్తీ చేయకుండా, పైగా ప్రతి దంట్లోనూ స్కామ్‌లకు పాల్పడుతోంది. నాడు జగన్ గారు ఒక్క సంతకంతో 1,32,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టిస్తే, నేడు కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తోంది. నాడు 'నాడు-నేడు' ద్వారా స్కూళ్లను కార్పొరేట్ నిమిత్తం తీర్చిదిద్ది, అమ్మఒడితో ప్రోత్సహించిన జగన్ గారి పథకాల పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజలను వంచిస్తోంది. మన బీసీ కులాలు, వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. అందుకోసం మనమందరం 2029 లక్ష్యంగా కష్టపడి పనిచేసి వైయ‌స్ఆర్‌సీపీ విజయం కోసం ఐకమత్యంగా ప‌నిచేయాలి.  

నాయి బ్రాహ్మణులను రాజ‌కీయంగా ప్రోత్స‌హించింది జగన్ గారే
- పార్టీ నాయీ బ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు పుల్ల‌య్య‌

గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో జగన్ గారు మన కులానికి గొప్ప గౌరవం కల్పించారు. చరిత్రలో తొలిసారిగా నాయి బ్రాహ్మణులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు మెంబర్‌గా అవకాశం ఇవ్వడంతో పాటు నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్, ఇతర శాఖల్లో డైరెక్టర్లు, డిసిసిబి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పదవులు ఇచ్చి రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు. ఒకప్పుడు హీనంగా చూసే స్థితి నుంచి సమాజంలో తలెత్తుకుని తిరిగేలా నాయి బ్రాహ్మణులకు ఆత్మగౌరవాన్ని తెచ్చిన నాయకుడు జగన్ గారే. గతంలో దివంగ‌త వైఎస్సార్ గారు అందించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ తోనే మన పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు కాగలిగారు.  

ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను, విద్యార్థులను, చేతివృత్తుల వారిని నమ్ముకుని బతికే వారిని మోసం చేస్తోంది; మ‌న హక్కులు,  షాపుల నిర్వహణ కోసం నిలదీస్తే నాయి బ్రాహ్మణులపై కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తోంది. కూటమి ప్రభుత్వ అబద్ధాలు, మోసపూరిత విధానాలను ఎదుర్కొంటూ, మనకు అండగా నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి భవిష్యత్తులో మళ్లీ గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

జ‌గ‌న్ గారు ఒక్క బ‌ట‌న్‌తో రూ. 50 కోట్ల సాయం చేశారు 
- యానాద‌య్య‌, మాజీ టీటీడీ బోర్డు మెంబ‌ర్, పార్టీ ఎస్ఈసీ సభ్యుడు 

గతంలో చంద్రబాబు హయాంలో నాయీ బ్రాహ్మణులు ఎంతో అవమానాలకు గురయ్యారు. జగన్ గారు అధికారంలోకి రాగానే మనకు పూర్వ వైభవాన్ని, సమాజంలో తగిన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. గతంలో నాయీ బ్రాహ్మణ, రజక, కుమ్మరి, యాదవ వంటి బీసీ కులాలకు చెందిన వారు రాజకీయంగా ఎక్కడా కనిపించని పరిస్థితి ఉండేది, కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాతే ప్రతి సామాజిక వర్గానికి రాజకీయ ప్రాధాన్యత లభించింది. కరోనా కష్టకాలంలో షాపులు మూతపడి మనవాళ్లు ఇబ్బందులు పడుతున్నప్పుడు, జగన్ గారు ఒక్క బటన్ నొక్కి 50 వేల షాపులకు గాను రూ. 50 కోట్లు నేరుగా ఆర్థిక సాయం అందించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి షాపున‌కు లబ్ధి చేకూర్చడమే కాకుండా, నాయీ బ్రాహ్మణుల విజ్ఞప్తి మేరకు ప్రతి షాపునకు 150 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను కూడా మంజూరు చేశారు. దేవుడు పుట్టినప్పటి నుండి దేవాలయాల్లో కైంకర్యాలు, క్షౌరవృత్తి చేస్తూ ఆలయాలకు కోట్ల రూపాయల ఆదాయం తెస్తున్న మనల్ని గతంలో 'గుడికి మీకు సంబంధం లేదు' అని అవమానించారు. అలాంటిది జగన్ గారు చరిత్రలోనే తొలిసారిగా 70 ఏళ్లలో లేని విధంగా మనల్ని దేవాలయాల ఉద్యోగులుగా గుర్తించి, రూ20 వేల జీతాన్ని ఖరారు చేసి ఉద్యోగ భద్రత కల్పించారు. మంత్రులు వద్దన్నా వినకుండా, ప్రత్యేకంగా గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ తెచ్చి మరి, రూ. 5 లక్షల ఆదాయం దాటిన ప్రతి దేవాలయ పాలక మండలిలో ఒక నాయీ బ్రాహ్మణుడికి సీటు ఇచ్చి రిజర్వేషన్ కల్పించారు. రాష్ట్రంలోని 1150 దేవాలయ పాలక మండళ్లలో 1150 మంది నాయీ బ్రాహ్మణులను శాశ్వత నాయకులుగా మార్చిన ఘనత జగనన్నది; మన పిల్లల కులం పేరుతో అవమానాలు పడకుండా చట్టం తెచ్చారు. 

కూటమి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ సగం జిల్లాల్లో అమలు కావడం లేదు, మన జీవోలను పక్కన పెట్టేసి మోసం చేస్తున్నారు; చంద్రబాబు పాలనలో మనకి దక్కింది ఏమీ లేదు. మనకు ఆత్మగౌరవం, జీవనోపాధి కల్పించిన వైయ‌స్ఆర్‌సీపీ కోసం ప్రతి నాయీ బ్రాహ్మణుడు ఒక మీడియా ఛానెల్‌లా మారి, జగనన్న చేసిన మేళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిని చేసుకోవడానికి కంకణబద్ధులై పనిచేయాలని పిలుపునిచ్చారు.

Back to Top