పశ్చిమగోదావరి: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక ప్రాజెక్టుకు ‘వైయస్ రాజశేఖర్రెడ్డి పోలవరం ప్రాజెక్టు’గా నామకరణం చేసి వైయస్సార్ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా నిర్మాణంలో ఉన్న పోలవరం ప్రాజెక్టును మాజీ మంత్రి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మారెడ్డి బృందంతో కలిసి పరిశీలించారు. ముందుగా ప్రాజెక్ట్ పై ఉన్న గడ్డల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయనకు గడ్డల నిర్మాణం వివిధ అంశాలపై అధికారులు ఫోటో గ్యాలరీతో వివరించారు. అనంతరం స్పిల్ వే పనులు కాపర్ డ్యాం పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడేందుకు భయపడుతున్న రోజుల్లో ప్రజల అవసరాల దృష్ట్యా దివంగత మహానేత వైయస్ రాజశేఖర్రెడ్డి పోలవరం పనులను ప్రారంభించారని తెలిపారు. వైయస్సార్ హయాంలోనే కుడి ఎడమ కాల్వల పనులు 80 శాతం పూర్తయ్యాయని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్ట్ను కేవలం ప్రచారానికి వాడుకున్నారు తప్ప.. ప్రాజెక్టు పనులను పూర్తిస్థాయిలో చేయలేకపోయారని చెప్పారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి హయాంలో పోలవరం పనులు పరుగులు పడుతున్నాయన్నారు.