వెలిగొండపై చంద్రబాబు క్రెడిట్‌ చోరీ.. 

ప్రజలను మభ్యపెడుతున్న కూటమి ప్రభుత్వం

వైయ‌స్‌ఆర్‌ హయాంలో పునాది.. వైయ‌స్‌ జగన్‌ హయాంలో టన్నెళ్ల పనులు పూర్తి

మార్కాపురం: పశ్చిమ ప్రకాశం ప్రజల మూడు దశాబ్దాల సాగు, తాగునీటి కల అయిన వెలిగొండ ప్రాజెక్టుపై చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి పాల్పడుతున్నారని ప్రకాశం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, మాజీ మంత్రి అన్నా రాంబాబు, మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టుకు చంద్రబాబు చేసిన పనులు స్వల్పమేనని, వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, వైయ‌స్‌ జగన్‌ హయాంలోనే కీలక పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.

చంద్రబాబు హయాంలో ప్రాజెక్టుకు శంకుస్థాపన మినహా పనులు ముందుకు సాగలేదని వారు తెలిపారు. వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండో టన్నెల్‌కు అనుమతులు తీసుకురావడంతో పాటు ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారని పేర్కొన్నారు. వైయ‌స్‌ జగన్‌ హయాంలో రెండు టన్నెళ్ల పనులు పూర్తయ్యాయని, ప్రాజెక్టును జాతికి అంకితం చేశారని తెలిపారు. కేవలం ఫీడర్‌ కెనాల్‌ ప్రారంభించి మొత్తం వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమేనని బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టు పూర్తికి ఇంకా నిధులు అవసరమున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు చెప్పాలని కోరారు.

వెలిగొండ కోసం భూములు, ఇళ్లు, గ్రామాలను త్యాగం చేసిన నిర్వాసితులకు పూర్తి పరిహారం అందించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం కోసం నిర్వాసితులు కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారని, వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. వెలిగొండ ప్రాజెక్టుపై క్రెడిట్‌ చోరీని ఆపి, నిర్వాసితులకు న్యాయం చేయాలని, ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి పశ్చిమ ప్రకాశం ప్రజలకు సాగు, తాగునీరు అందించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.

Back to Top