విశాఖపట్నం: చంద్రబాబు సైకో అయితే.. కొడుకు లోకేష్ ఐరన్ లెగ్ అని మంత్రి రోజా అన్నారు. లోకేష్ అడుగుపెడితే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని పలు ఉదాహరణతో సహా చెప్పారు. లోకేష్ అడుగుపెట్టగానే పుష్కరాల్లో 29 మంది చనిపోయారని, లోకేష్ ఎమ్మెల్సీగా అడుగుపెట్టగానే చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయని, లోకేష్ పాదయాత్ర పోస్టర్ రిలీజ్ చేస్తే కందుకూరులో 8 మంది చనిపోయారని, లోకేష్ పాదయాత్ర చేపట్టిన తొలిరోజు తారకరత్న అస్వస్థతకు గురయ్యాడని మంత్రి రోజా చెప్పారు. విశాఖపట్నంలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. తారకరత్న అస్వస్థతకు గురైతే చంద్రబాబు, లోకేష్ పట్టించుకోలేదు. తారకరత్న తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లోకేష్కు లేదు. పాదయాత్ర తొలిరోజు ప్రసంగంలో లోకేష్ పాండిత్యాన్ని చూశాం. జీవోను జియో అని, పాలనను పానల అని, ప్రశాంతతను ప్రశాంత్ అత్త అని మాట్లాడాడు. తెలుగు సరిగ్గా మాట్లాడటం రాని వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడు. అతను లోకేష్ కాదు.. పులకేష్.
తన తండ్రి ఆశయాల సాధన కోసం, రాష్ట్ర ప్రజల కోసం వైయస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. ప్రజల కష్టాలను కళ్లారా చూశారు, విన్నారు. వారికి భరోసా ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత 98 శాతం హామీలు పూర్తిచేశారు. లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి, ప్రజలు ఏం చేశాడు..? పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను నమ్మించవచ్చనే భ్రమలో చంద్రబాబు, లోకేష్ ఉన్నారు. జనాలు పిచ్చవారు అనుకుంటున్నారా..?
దేశంలోనే ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయ వ్యవస్థ పెట్టి 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను ఇచ్చారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేశారు. పోలీస్ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఈరోజు అధికారంలో పోయి నిరుద్యోగులైన చంద్రబాబు, లోకేష్ రోడ్ల మీదకు వచ్చారు. అబద్ధాలతో, అసత్య ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారు.