తాడేపల్లి: `విజయనగరం పర్యటనకు వెళ్లిన పవన్ అక్కడ అసలు ఏం చేసినట్లు. పవన్ కళ్యాణ్కు పరిస్థితి చూస్తుంటే జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు` మాదిరిగా ఉందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గుంకలాంలో పవన్ మాటలు, ప్రవర్తన, వింత చేష్టలు చూసిన తరువాత `జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లు` అనే ట్యాగ్ లైన్ పెట్టుకోవడం బెటర్ అని సూచించారు. ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వంపై ఏదో ఒక నెపం మోపేందుకు వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్గా ఏపీకి పవన్ వస్తున్నాడన్నారు. 21 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతుంటే చూడలేక పవన్కు కడుపుమంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంకలాంలో కూడా 12 వేల ఇళ్ల నిర్మాణాలు జరుగుతుంటే ఏమీ జరగనట్టు చెప్తున్నాడు. కళ్లుంటే, సరిగా చూస్తే ఆ ఇళ్ల నిర్మాణం కనిపిస్తుంది అని మండిపడ్డారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. మంత్రి జోగి రమేష్ ఇంకా ఏం మాట్లాడారంటే.. ఇవాళ అక్కడ పవన్కళ్యాణ్కు ఘోర అవమానం జరిగింది. గుంకలాంలో లబ్ధిదారులంతా వచ్చి ప్రభుత్వంపై నిందలు వేసి, తనకు బాసటగా నిలుస్తారని పవన్కళ్యాణ్ ఆశించారు. విజయనగరం నుంచి జోరుగా గుంకలాం వరకు వెళ్లాడు. కానీ అక్కడ వారి స్పందన చూసి నోరెళ్లబెట్టాడు. తమకు ఇళ్లు కట్టిస్తున్నారని, బిల్లులు కూడా ఇస్తున్నారని అంతా చెప్పడంతో పవన్ గుండె జారి పోయింది. దీంతో సైకో చేష్టలు సరేసరి. పవన్ వెంట లబ్ధిదారులు ఎవ్వరూ లేరు. గుంకలాం వెళ్లిన పవన్, నువ్వు అక్కడ ఏం చేశావు? ఏం చూశావు? వచ్చావు. 20 నిమిషాలు తిరిగావు. ప్రభుత్వం మీద బురద వేయడం కోసం ఒక వెహికిల్ ఎక్కి, తిట్టి వెళ్లిపోయావు. అంటే వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్గా వచ్చి వెళ్లి పోయావు. అసలు నీకు ఎందుకంత కడుపు మంట? నీకసలు కళ్లున్నాయా?.. దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ జగన్. రెండు దశల్లో 21 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. ఆ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అంత మంచిగా పనులు జరుగుతుంటే, ఎందుకంత కడుపు మంట? గుంకలాంలో 10 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే, ఏ పనులూ జరగడం లేదంటావా? నీకసలు కళ్లున్నాయా?. పనులు ఏమీ జరగనట్లు గెస్ట్ ఆర్టిస్ట్ కలరింగ్ ఇస్తున్నారు. ఎంత దుర్మార్గం. అక్కడ ఆ స్థాయిలో పనులు జరుగుతుంటే, ఏమీ జరగడం లేదని, కేవలం కమాన్ మాత్రమే ఉందని ఎలా అంటున్నారు? పవన్ నీకు సిగ్గుందా?.. ఇదే పవన్కళ్యాణ్, ఎక్కడి నుంచి మాట్లాడావు? మనసున్న సీఎం వైయస్ జగన్, గుంకలాంలో సుమారు 12 వేల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన లేఅవుట్ నుంచి మాట్లాడావు. అది మా వైయస్ జగన్ ప్రభుత్వం ఇచ్చింది. నీవక్కడ నిల్చుని మాట్లాడావు. నీకసలు సిగ్గుందా?. మీరేం చేశారు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వంలో ఉన్నాయి. ఆనాడు మీరిచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారు? అర్హులైన పేదలందరికీ మూడు సెంట్లలో ఉచితంగా పక్కాఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. మరి మీ ఉమ్మడి ప్రభుత్వంలో కనీసం ఒక్కటంటే ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చారా? అలాంటి మీరు ఈరోజున, మేము ఇచ్చిన లేఅవుట్లో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తున్నావా? నీకసలు సిగ్గుందా? ఆనాడెందుకు ప్రశ్నించలేదు?.. 2014 నుంచి 2019 వరకు కనీసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదు. మరి ఆరోజు నువ్వు, చంద్రబాబు చొక్కా ఎందుకు పట్టుకోలేదు? ఆయనను ఎందుకు ప్రశ్నించలేదు. పవన్కళ్యాణ్ పిట్టకధలు చెబుతున్నాడు. పక్షికి కూడా గూడు ఉంటుందని అంటున్నాడు. మేము 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 21 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నాం. మరి ఆనాడు ఒక్క ఇంటి స్థలం కూడా ఇవ్వని దత్త తండ్రిని ఒక్క మాట అనలేదు. కనీసం ప్రశ్నించలేదు. పవన్ పిచ్చి మాటలు విని పిల్ల సైకోలు కూడా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. వారు లేఅవుట్లలోకి వెళ్తే, లబ్ధిదారులే తగిన బుద్ధి చెబుతున్నారు. నువ్వు వారిని రెచ్చగొడుతున్నావు. హైదరాబాద్ పారిపోతున్నావు. దమ్ముంటే రండి. మీరే చూస్తారు.. ఈరోజు సీఎం వైయస్ జగన్ మనసు పెట్టి పని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. గూడు లేని నిరుపేదలకు పక్కాగా ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. అసాధారణ స్థాయిలో, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. యావత్ దేశమే అభినందిస్తోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్కళ్యాణ్ కూడబలుక్కుని కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. పవన్కు దమ్ముంటే రండి. గడప గడపకూ కార్యక్రమంలో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారా? ఆశీర్వదిస్తున్నారా? ఏం చేస్తున్నారనేది చూడండి. నీకు ధైర్యం ఉంటే రా. చూడు. కూల్చేస్తానంటున్నాడు పవన్కళ్యాణ్. ఏమిటి కూల్చేది. ఒక్క అడుగుతో మొదలై లక్షలాది మంది అడుగులతో, కోట్లాది మంది హృదయాల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ప్రభుత్వం.. చిరస్థాయిగా గుర్తుండిపోయే వైయస్ జగన్. నువ్వు కాదు కదా, నీ దత్తతండ్రి చంద్రబాబు మూకుమ్మడిగా కలిసి వచ్చినా, వైయస్ జగన్ని ఇంచ్ కూడా కదిలించలేరు. దేశంలో ఏ రాష్ట్రంలో ఏ సీఎం కూడా వైయస్ జగన్లా ఆలోచన చేయడం లేదు. ఇన్ని పథకాలు అమలు చేయడం లేదు. అందుకే ఆయన వెంట ప్రజలంతా ఉన్నారు. నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారు. ఆ ఇద్దరిదీ రాక్షసక్రీడ.. పవన్కళ్యాణ్, ఆయన దత్త తండ్రిది రాక్షసక్రీడ. ఇద్దరూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తీవ్రస్థాయిలో దుర్భాషలు. వారి చర్యలకు రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు కానీ, పవన్కళ్యాణ్ కానీ.. మీకు మొన్ననే చెప్పాను. మీరు ఏ లేఅవుట్కు అయినా రండి. అన్నీ చూపిస్తాం అని చెప్పాం. అయినా మీరు దొడ్డిదారిన వెళ్తూ, లబ్ధిదారులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పీకేస్తాం.. లాగేస్తాం.. అన్న మీ మాటలు.. సినిమాల్లోనే చెల్లుతాయి. అంతే తప్ప, రాజకీయాల్లో కాదు. ముందు నువ్వు గెలుస్తావా? లేదా? చూసుకో. రాసి పెట్టుకొండి. 2024 ఎన్నికల్లో పవన్కళ్యాణ్, నారా లోకేష్తో పాటు, చంద్రబాబు కూడా ఓడిపోబోతున్నారు. పేదలు మిమ్మల్ని క్షమించరు.. అసలు అవినీతికి తావెక్కడ ఉంది. మూడు విధానాల్లో ఇళ్ల నిర్మాణం. లబ్దిదారుడు స్వయంగా కట్టుకుంటే, ఆ మొత్తం నేరుగా వారి ఖాతాలో వేస్తున్నాం. దేశంలో ఎక్కడా కూడా ఒకేసారి 17 వేలకు పైగా లేఅవుట్లలో కాలనీలు అభివృద్ది చేయలేదు. కానీ మీరు పేదల జీవితాలతో ఆడుకున్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వకూడదని కోర్టులకెక్కారు. అందుకు మిమ్మల్ని వారు క్షమించరు. ఇవాళ కాలనీల్లోకి వెళ్లి, పేదలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏమీ చేయడం లేదని వారు చెప్పాలని కోరుకుంటున్నారు. మీకసలు బుద్ధి ఉందా? ప్రభుత్వం ఇన్ని చేస్తుంటే, ఏమీ చేయడం లేదని వారంటారా? మీ చెంప ఛెల్లుమనిపిస్తారు. లోకేష్, ఎందుకు పాదయాత్ర?.. లోకేష్ మోకాళ్లతో నడిచినా, దొర్లుకుంటే నడిచినా, పంగనామాలు పెట్టి నడిచినా.. ఆయన, ఆయన తండ్రి చేసిన పాపాలు ఊర్కెనే వదిలిపెట్టవు. అందుకే 2024లో ఆ తండ్రీ కొడుకులిద్దరితో పాటు, చంద్రబాబు దత్తపుత్రుడు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టబోరు. ఈ ప్రభుత్వం అన్ని వర్గాలకు ఇన్ని మంచి పనులు చేస్తుంటే.. ఏం చేయడం లేదని చెప్పి లోకేష్ పాదయాత్రకు సిద్దమవుతున్నారు. దీనిపై నువ్వు చర్చకు వస్తావా? ఆ ధైర్యం ఉందా?.. అని మంత్రి జోగి రమేష్ సవాల్ చేశారు.