అనంతపురం: ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల దౌర్జన్యాలకు నిరసనగా జూలై 31న వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ప్రకటించారు. ఉరవకొండ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ఈ ఆందోళనలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. మీడియా సమావేశంలో ఆయన ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్సీ, బీసీ వర్గాలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఉరవకొండ నియోజకవర్గంలో ఎస్సీ, బీసీ వర్గాలను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న దౌర్జన్యాలు, వేధింపులకు వ్యతిరేకంగానే జూలై 31న భారీ ఆందోళన చేపడుతున్నామని తెలిపారు. ప్రజలను భయపెట్టి రాజకీయాలు చేయాలనుకుంటే వైయస్ఆర్సీపీ చూస్తూ ఊరుకోదని స్పష్టం చేశారు. టీడీపీ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి బాధిత వర్గాలకు అండగా నిలిచేందుకు చేపట్టే ఈ ధర్నాలో వైయస్ఆర్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు.