గోల్డ్‌ మెడలిస్ట్‌ దుర్గయ్యతో చర్చకు సిద్ధమా లోకేష్‌?

ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి

 వైయస్సార్‌ జిల్లా: డీఎస్సీ, స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల వ్యవహారంపై కడప ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి మంత్రి నారా లోకేష్‌ను సూటిగా ప్రశ్నించారు. లోకేష్‌తో చర్చకు తామే సిద్ధమని డీఎస్సీ అభ్యర్థులు సవాల్‌ చేస్తున్నారని, ముందుగా వారికి సమాధానం చెప్పాలని అన్నారు. గోల్డ్‌ మెడలిస్ట్‌ దుర్గయ్య లోకేష్‌తో చర్చకు సిద్ధమని చెబుతున్నారని, ఆయన విసిరిన సవాల్‌ను స్వీకరించే ధైర్యం లోకేష్‌కు ఉందా అని ప్రశ్నించారు. పరీక్ష లేకుండా స్పోర్ట్స్‌ కోటాలో ఎంపిక చేసి, ఆ తర్వాత సంబంధిత జీవోను రద్దు చేయడం వెనుక కారణాలను స్పష్టం చేయాలని కోరారు.

అంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులను పోల్చడం సరికాదని అవినాష్‌రెడ్డి అన్నారు. కోన రవి, భరత్‌ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారిని పీవీ సింధుతో పోల్చడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అవసరం లేదని, తమ తరఫున పేర్ని నాని చర్చకు వస్తారని తెలిపారు. లోకేష్‌కు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధం కావాలని సవాల్‌ విసిరారు. కోర్టులో ఉన్న అభ్యర్థుల కేసులే లోకేష్‌కు సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలని పేర్కొన్నారు. టెట్‌ సమస్యపై ఉపాధ్యాయులతో కలిసి కేంద్ర మంత్రిని కలిసినందుకు టీచర్లను వేధించడం సరికాదని అవినాష్‌రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులపై విధించిన సస్పెన్షన్లను వెంటనే ఎత్తివేయాలని, లేనిపక్షంలో వారికి అండగా వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు.

 

Back to Top