ఆత్మకూరు: శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరులోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 'జగన్ 2.0 సూపర్ యాప్` పోస్టర్ను ఆవిష్కరించారు. మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించిన ఈ యాప్ను పార్టీ శ్రేణులు విస్తృతంగా వినియోగించాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్ 2.0 సూపర్ యాప్ వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, అధికారిక సమాచారం, కార్యకర్తల అనుసంధానానికి ఈ యాప్ సమర్థవంతమైన డిజిటల్ వేదికగా ఉపయోగపడుతుందని వివరించారు. అనంతరం ఎస్ఐఆర్ (Special Intensive Revision) కార్యక్రమానికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారమ్లు, బూత్ స్థాయిలో నిర్వహించిన Minutes of Meetings లో నమోదు చేసిన ASDD (Absent, Shifted, Dead, Duplicate) వివరాల సేకరణ, పరిశీలన, సమర్పణ విధానంపై బీఎల్ఏలు, బూత్ కన్వీనర్లకు సమగ్ర అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు, వెలుగోడు పట్టణ, మండల అధ్యక్షులు, వైయస్ఆర్సీపీ నాయకులు, బీఎల్ఏలు, బూత్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.