దేవరపల్లి హోటల్ ఘటనపై వైయ‌స్ జగన్‌ను కలిసిన హోటల్ నిర్వాహకులు

తాడేపల్లి : తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలోని హోటల్ నిర్వాహకులు చందన వరలక్ష్మి, చందన దివ్య గురువారం తాడేపల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీ అధ్యక్షుడు శ్రీ వైయ‌స్ జగన్‌ను కలిసి దేవరపల్లి పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై వివరాలు తెలియజేశారు. దేవరపల్లి పొగాకు బోర్డు వేలం కేంద్రం పర్యటన సందర్భంగా భారీగా జనం తరలిరావడంతో ఏర్పడిన రద్దీ కారణంగానే తోపులాట చోటుచేసుకుందని, ఆ ఘటనకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదని వారు శ్రీ వైయ‌స్ జగన్‌కు వివరించారు. తమ హోటల్‌ను వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని హోటల్ నిర్వాహకులు స్పష్టం చేశారు. జరిగిన ఘటనను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు.

తాము వైయ‌స్ఆర్‌సీపీ కుటుంబానికి చెందిన వారమేనని, వైయ‌స్ జగన్ ప్రభుత్వ హయాంలో తమ కుటుంబం పలు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిందని చందన వరలక్ష్మి, చందన దివ్య తెలిపారు. వాస్తవాలను వక్రీకరిస్తూ జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.
 

Back to Top