ప్రతి కార్యకర్తతో అనుసంధానమే 'జగన్ 2.0 సూపర్ యాప్' లక్ష్యం 

 కనిగిరిలో యాప్ పోస్టర్ ఆవిష్కరణ.. ప్రతి కార్యకర్త డౌన్‌లోడ్ చేసుకోవాలని దద్దాల నారాయణ యాదవ్ పిలుపు 

 కనిగిరి: పార్టీ నాయకత్వం, కార్యకర్తల మధ్య సమర్థవంతమైన అనుసంధాన వేదికగా 'జగన్ 2.0 సూపర్ యాప్` పనిచేస్తుందని కనిగిరి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన  'జగన్ 2.0 సూపర్ యాప్` పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తూ అణచివేత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అలాంటి పరిస్థితుల్లో పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆలోచనతో కార్యకర్తలకు అండగా, పార్టీ నాయకత్వంతో నిరంతర అనుసంధానానికి  'జగన్ 2.0 సూపర్ యాప్‌`ను రూపొందించారని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రతి కార్యకర్త నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు, పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పోలీసు వేధింపులు వంటి అంశాలను నేరుగా పార్టీ దృష్టికి తీసుకురావచ్చని వివరించారు. పార్టీ సమావేశాలు, మీడియా సమావేశాలు, ముఖ్యమైన కార్యక్రమాలు, అధికారిక ప్రకటనలు లైవ్ ఫీడ్ రూపంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

పార్టీ శ్రేణులందరూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి  'జగన్ 2.0 సూపర్ యాప్`ను తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకుని పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యలను పార్టీ నాయకత్వానికి చేరవేయడానికి సమర్థవంతంగా వినియోగించాలని దద్దాల నారాయణ యాదవ్ పిలుపునిచ్చారు. 

Back to Top