తాడేపల్లి: ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు కూటమి ప్రభుత్వం తెరలేపిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టడం అత్యంత దారుణమని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. గడికోట శ్రీకాంత్రెడ్డి ఏమన్నారంటే..`ఏపీలో కూటమి ప్రభుత్వం అరాచకాలు పతాకస్థాయికి చేరాయి. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. నిజాలు రాసే కలాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అణగదొక్కుతున్నారు.ఈ క్రమంలోనే.. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాకుగా చూపించి ‘సాక్షి’పై దాడులకు పాల్పడుతున్నారు. ప్రజల పక్షాన నిలబడుతూ, వాస్తవాలను ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తున్న ‘సాక్షి’పై రాజకీయ కుట్రలకు బరితెగిస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరిమూకలు కలిసి రాష్ట్రవ్యాప్తంగా ‘సాక్షి’ కార్యాలయాలపై మూకుమ్మడి దాడులకు తెగబడ్డారు. ఈ దాడులపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది.ఏకంగా ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయాన్ని తగలబెట్టడం అత్యంత దారుణం. ఈ దాడులు, దహనాలు, చర్యలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది` అంటూ ప్రకటనలో పేర్కొన్నారు.