తిరుపతి: శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్) లో పారదర్శకతను పూర్తిగా పక్కనబెట్టి, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న 303 ఉద్యోగాల నియామక ప్రక్రియ రాష్ట్రంలో మరో మహా డీఎస్సీ తరహా కుంభకోణాన్ని తలపిస్తోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తిరుపతిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సమీప బంధువైన ఆదిశేషయ్య అనే వ్యక్తి స్విమ్స్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్, డైరెక్టర్లను సైతం పక్కనపెట్టి.. వెనుక ఉండి ఈ అవినీతి చక్రాన్ని తిప్పుతున్నారని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు లేదా ప్రభుత్వ అనుమతి లేకుండా, కనీసం నిపుణుల కమిటీ నివేదిక కూడా లేకుండానే కొద్దిమంది నిర్దిష్ట వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా విద్యార్హతలు, సిలబస్, మరియు ప్రాథమిక వేతనాలలో ఇష్టారాజ్యంగా మార్పులు చేశారని మండిపడ్డారు. నోటిఫికేషన్ విడుదలైన రోజే ఉద్యోగాలన్నీ అమ్ముడుపోయాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారని, పవిత్రమైన టీటీడీ అనుబంధ సంస్థ ప్రతిష్టను కాపాడేందుకు ఈ మొత్తం నియామక ప్రక్రియపై తక్షణమే ఉన్నత స్థాయిలో నిష్పాక్షిక విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే... - బోర్డు, ప్రభుత్వ అనుమతులు లేవు – నిబంధనలు పూర్తిగా తుంగలో తొక్కారు: స్విమ్స్ యాజమాన్యం విడుదల చేసిన 236 నర్సింగ్ పోస్టులు (24 బ్యాక్లాగ్, 212 రెగ్యులర్), 19 పారామెడికల్ పోస్టులు, 48 నాన్-పారామెడికల్ పోస్టుల నోటిఫికేషన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది.ని సాధారణంగా ఏ పోస్టుకైనా విద్యా అర్హతలు, అనుభవ ప్రమాణాలు లేదా వేతనాల మార్పులు చేపట్టాలంటే దానికి సంబంధించిన రంగానికి చెందిన నిపుణులతో అధికారిక కమిటీని ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ నివేదికను సంబంధిత బోర్డు ఆమోదించి, ఆపై ప్రభుత్వ అనుమతి పొందాల్సి ఉంటుంది. అయితే, ఇలాంటి ప్రాథమిక నియమ నిబంధనలు, నిపుణుల కమిటీ నివేదికలు, బోర్డు ఆమోదము మరియు ప్రభుత్వ అనుమతి ఏవీ లేకుండానే ఇష్టారాజ్యంగా విద్యార్హతలు, సిలబస్, వేతనాలలో మార్పులు చేశారు. - చంద్రబాబు బంధువు ఆదిశేషయ్య విష్ణుచక్రం.. ముఖ్యమంత్రికి అత్యంత సమీప బంధువైన ఆదిశేషయ్య అనే వ్యక్తి స్విమ్స్ లో సర్వాధికారిగా మారి విష్ణు చక్రం కంటే వేగంగా అవినీతి చక్రాన్ని తిప్పుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో అత్యున్నత పదవుల్లో ఉన్న వైస్ ఛాన్సలర్ మరియు స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.వి. కుమార్ ను కూడా ఈ నియామక ప్రక్రియకు సంబంధించి పూర్తిగా పక్కన పెట్టడం వెనుకు ఉన్న మర్మమేంటో తెలియాలి.ఈ నియామక కమిటీకి స్విమ్స్ తో సంబంధం లేని బర్డ్ సంస్థ డైరెక్టర్ను అధ్యక్షుడిగా ఎందుకు నియమించారో సమాధానం చెప్పాలి. అంతేకాకుండా, గతంలో అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఎదుర్కొంటున్న ఆదికృష్ణయ్య అనే వ్యక్తిని ఈ పరీక్షా విభాగానికి శాఖాధిపతిగా నియమించడం చూస్తుంటే, ముందే అనుకున్న వారికి ఉద్యోగాలు కట్టబెట్టేందుకేనని స్పష్టమవుతోంది.గతంలో జరిగిన 100 మంది డాక్టర్ల నియామకాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి..ఆ స్కామ్లో ఈ ఆదిశేషయ్యే ప్రధాన పాత్రధారి అని స్విమ్స్ లోని ప్రతి ఒక్కరూ కోడై కూస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న 303 ఉద్యోగాల నియామకాలలోనూ అదే తరహా దోపిడీకి స్కెచ్ వేశారు. - కావాల్సిన వారి కోసమే విద్యార్హతలలో మార్పులు – జీతాల భారీ పెంపు అర్హులైన నిరుద్యోగ అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీస్తూ, ముందే నిర్ణయించుకున్న కొద్దిమంది అనుకూల వ్యక్తుల కోసమే విద్యార్హతల ప్రమాణాలను మార్చేశారు. ఉదాహరణకు నాన్-పారామెడికల్ పోస్టులకు లోకమంతా బీటెక్ ,ఎంసీఏ విద్యార్హతలుగా నిర్ణయిస్తే, స్విమ్స్ లో మాత్రం దాన్ని మార్చి "బీటెక్ సీఎస్ఈ / ఎంఎస్ ఐటీ" గా మార్చడం వెనుక సదరు వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. బోర్డు లేదా ప్రభుత్వ అనుమతి లేకుండానే నిర్దిష్ట పోస్టుల ప్రాథమిక వేతనాలను గణనీయంగా పెంచి, తమకు కావలసిన వారికి భారీ జీతాలతో కొలువులు ఇచ్చేందుకు వీలుగా అనుకూల వాతావరణాన్ని సృష్టించుకున్నారు. - ఇంటర్వ్యూల పేరుతో మెరిట్కు తూట్లు గ్రూప్-1 కంటే తక్కువ స్థాయి ఉద్యోగాల భర్తీలో రాతపరీక్షల మెరిట్ ఆధారంగానే నియామకాలు చేపట్టడం దేశవ్యాప్త ఆనవాయితి.. అయితే ఈ నియామకాల్లో ఇంటర్వ్యూలను తీసుకురావడం వెనుక అక్రమాలకు పాల్పడే కుట్ర ఉంది. "ఏపీటీ ఆన్లైన్ సర్వీసెస్ కేవలం ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు మాత్రమే పరిమితం. కానీ అసలైన ప్రశ్నాపత్రాల సెలెక్షన్, రూపకల్పన నిపుణులైన ఎయిమ్స్, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం లేదా ఐఐటీ,ట్రిపుల్ ఐటీ ,ఐఎస్బీ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నిపుణుల ద్వారా చేయించాల్సింది పోయి, ఆదిశేషయ్య అనుచరులతో కూడిన ఐదుగురు సభ్యుల కమిటీయే సొంతంగా ప్రశ్నలు తయారు చేసుకుంటోంది. పరీక్షల్లో టాప్ మెరిట్ వచ్చినా, వీరు పెట్టే మౌఖిక ఇంటర్వ్యూలలో తమకు నచ్చిన వారికి, డబ్బులు ఇచ్చిన వారికే మార్కులు వేసి ఉద్యోగాలు అమ్ముకోబోతున్నారు. నోటిఫికేషన్ రోజే ఉద్యోగాలన్నీ అమ్ముడుపోయాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. - ఇంజినీరింగ్, వేద పారాయణదారుల పోస్టుల భర్తీలోనూ ఇదే దారుణం గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ హయంలో హిందూ ధర్మ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తూ 700 వేద పారాయణదారుల పోస్టుల భర్తీకి మరియు టీటీడీలో అవసరమైన 60 ఇంజినీరింగ్ పోస్టుల (27 ఏఈ, 10 ఏఈఈ, 19 ఏటీఓ, 4 ఎలక్ట్రికల్) భర్తీకి మద్రాసు ఐఐటీ ద్వారా పారదర్శక నోటిఫికేషన్ ఇచ్చాం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రక్రియను పూర్తిగా అవినీతిమయం చేశారు. గతంలో 34 వేల మంది దరఖాస్తు చేసుకుంటే, కూటమి ప్రభుత్వం ప్రస్తుతం అభ్యర్థులు రెండు రకాల పోస్టులకు పరీక్ష రాయకుండా నిబంధనలు మార్చి కేవలం 18 వేల మందే పరీక్ష రాసేలా పోటీని తగ్గించారు.మరోవైపు ఒక్కొక్క పోస్టును రూ. 30 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అందుకే ఇంతవరకు ఆ ఫలితాలను బయటపెట్టడం లేదు. మరోవైపు గతంలో వేదాలపై కనీస పరిజ్ఞానం లేని రఘునాథ్ (డిపిపి సెక్రెటరీ), మేడసాని మోహన్ ల ఆధ్వర్యంలో ఏడాది క్రితం ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కొక్క పోస్టును రూ. 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నారు. వాటి ఫలితాలే ఇంతవరకు వెల్లడించలేదు. మరలా టీటీడీ బోర్డు అధ్యక్షుడు బీ.ఆర్. నాయుడు 691 వేదపారాయణదారుల పోస్టులను భర్తీ చేస్తున్నామని ప్రకటించడం వెనుక ఉన్న అవినీతి కొండపై సమాధానం చెప్పాలి. టీటీడీ అనేది కేవలం ఒక ప్రభుత్వ సంస్థ మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి, వేద సంస్కృతికి ప్రతీక అయిన పవిత్రమైన పీఠమని భూమన కరుణాకర రెడ్డి పేర్కొన్నారు. అందువల్ల ఈ నియామకాల వ్యవహారంలో పారదర్శకత, పక్షపాత రాహిత్యం, ప్రతిభా ప్రామాణికత అనే మూడు సూత్రాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ఇది కూటమి ఆధ్వర్యంలో గతంలో నిర్వహించి డియస్సీ తరహా స్కామ్ లా కనిపిస్తోందని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షంగా నిరుద్యోగ యువత ఆశలను, భక్తుల భక్తిని కాపాడటం తమ బాధ్యతని, ప్రభుత్వం మౌనం వీడి తక్షణమే స్విమ్స్ 303 ఉద్యోగాల నోటిఫికేషన్ మరియు ఇతర నియామకాలపై ఉన్నత స్థాయి నిష్పాక్షిక విచారణ జరిపించాలని కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.