కృష్ణాజిల్లా: దివిసీమతో పాటు కృష్ణా డెల్టా రైతాంగానికి పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ పుల్లిగడ్డ ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద రైతులు, వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్బాబు ధర్నా నిర్వహించారు. కృష్ణా డెల్టాలో సాగు చేస్తున్న రైతులకు అవసరమైన నీటిని అందించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. రెండు మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీరు సరఫరా చేయకపోతే కృష్ణా, గుంటూరు జిల్లాల వైయస్ఆర్సీపీ శ్రేణులు, రైతులతో కలిసి విజయవాడ ఇరిగేషన్ శాఖ కార్యాలయం వద్ద భారీ నిరసన చేపడతామని హెచ్చరించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే కృష్ణా డెల్టా రైతుల సమస్యల పరిష్కారం కోసం అవనిగడ్డ నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీ వరకు వేలాది మంది రైతులతో పాదయాత్ర చేపడతామని సింహాద్రి రమేష్బాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కృష్ణా డెల్టా రైతాంగానికి సాగునీరు అందేలా పోరాడాల్సిన బాధ్యత తనపై ఉందని, రైతులకు న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదని సింహాద్రి రమేష్బాబు తేల్చిచెప్పారు.