నంద్యాల: శ్రీశైలం నియోజకవర్గంలో తెలుగు దేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి ప్రధాన అనుచరులు తెలుగు దేశం పార్టీని వీడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. శ్రీశైలానికి చెందిన టిడిపికి ముఖ్య నాయకుడు టిఎండి రఫీ ఆ పార్టీకి చెందిన 500 కుటుంబాలతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే చక్రపాణిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై తాము వైయస్ఆర్ సీపీలో చేరినట్లు టీఎండీ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం వైయస్ జగన్ బాటలో అడుగు వేస్తూ ప్రజల హృదయాలను దోచుకున్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి వెంట నడిచేందుకు ముందుకు వచ్చామన్నారు. ప్రజలందరినీ కలుపుకొని అభివృద్ధి ,సంక్షేమ ఫలాలను ప్రజలకు అందజేస్తున్న శిల్పాకు మద్దతుగా ఉంటామని చెప్పారు. ఆదరణ వైపుగా పయణం .. శ్రీశైలం ఒక పుణ్యభూమి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున లింగం...అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన భ్రమరాంబిక దేవి, ఒకే చోట వెలసిన దివ్య భూమి. అలాగే శ్రామిక శక్తికి ఒక ఆనవాలు సున్నిపెంట. ఆధునిక దేవాలయమైన శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం వచ్చిన శ్రమజీవులు, ఇంజనీర్లకు ఆవాసం. అంతటి ప్రాముఖ్యమున్న ఈ గడ్డ గతమంతా తరచి చూస్తే ఏముంది...? అంతా వ్యధార్థ జీవన కథనాలే వినపడేవి. మొన్నటి దాకా ఇక్కడ రాజకీయమంటే వ్యక్తుల మధ్య అఘాతాలు సృష్టించి పబ్బం గడుపుకోవడమే. మూడున్నర దశాబ్దాల పాటు రెండు కుటుంబాల రాజకీయ ఎత్తులు పైఎత్తుల నడుమ నలిగిన ఈ ప్రాంతం అభివృద్ధికి నోయక ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అయితే ఈ సందర్భంలోనే ఒక అనూహ్య మలుపు కనిపించింది. రాజకీయమంటే అధికార దర్పం ... అందిన కాడికి దోచుకునే తత్వం అన్న కఠిననిజం నుంచి, కాదు కాదు రాజకీయం అంటే సేవాభావం.... ప్రతి మనిషిని చేయి పట్టుకు మరీ అభివృద్ధి పథం వైపు నడిపించడమని శ్రీశైలం నియోజక వర్గాన్ని తన రాజకీయ కార్యరంగంగా శిల్పా చక్రపాణిరెడ్డి ఎంచుకున్న తరువాతేనని తెలియ వచ్చింది. శ్రీశైల క్షేత్రాన్ని అత్యున్నత స్థాయి ఆధ్యాత్మిక ప్రాంతంగా మలచడంలోను... సున్నిపెంటను ఒక అస్తిత్వ గ్రామంగా నిలపడంలోను శిల్పా చక్రపాణిరెడ్డి ముద్ర స్పష్టంగ కనిపించింది. ప్రాజెక్ట్ పునాదుల్లో ఎన్నో జీవాలు కనుమరుగు కాగా మిగిలిన వారి వారసులకు కాళ్ళకింద నేల ఎపుడు జారిపోతుందో ననే అభద్రతతో బతికిన సున్నిపెంటను గ్రామపంచాయతీగా మార్చి అక్కడి జనానికి బతుకు భరోసా కల్పించింది శిల్ప చక్రపాణి రెడ్డే . సచివాలయాలు.. వాటిలో పని చేసే ఉద్యోగులు, వాలంటీర్లు ఇలా ఆ గ్రామంలో ఒక సజీవ వాతావరణాన్ని కల్పించారు. సిసి రహదారులు, తాగునీటి పైపులైన్లు ఒకటేమిటి అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపారు. ఇక శ్రీశైలానికి వస్తే... ఎన్నోదశాబ్దాలుగా అటవీ శాఖ ఖాతాలో దఖలు పడ్డ 5000 ఎకరాల దేవాలయ భూమిని చెరవిడిపించిన క్రాంతి దర్శి శిల్పా. ప్రజలను అమితంగా ప్రేమించే గుణం ..వారి జీవితాల్లో అభివృద్ధిని కాక్షించే మనసు శిల్పాకు ఇన్ బిల్ట్ గా ఉన్న లక్షణం. ఆ లక్షణమే శ్రీశైలంలో కనీసం వెయ్యి ఉద్యోగాలను అక్కడి యువతకు అందించింది. ఆయన పిలుపులో ఉండే కమ్మదనం...నెమ్మది తనం కార్యకర్తలను ఆయనతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకునేలా చేశాయి. ఇది ఎదుటి రాజకీయ పక్షము లోని కార్యకర్తలను కూడా ఆలోచనలో పడేసింది. అలాగే తరుచుగా పసుపు పార్టీ నాయకుడి అహంకార పూరిత వ్యాఖ్యలు, పార్టీ లకు అతీతంగా శిల్పా చేస్తున్న అభివృద్ధి వంటి అంశాలే శ్రీశైలం, సున్నిపెంటలలో వైరి పక్షానికి కార్యకర్తలు లేకుండా చేశాయి. ఈ స్థితికి పరాకాష్ఠ అన్నట్లుగా శ్రీశైలానికి చెందిన రఫీ పెద్ద సంఖ్యలో దాదాపు 500 కుటుంబాల కార్యకర్తల తో పాటు వైయస్ఆర్సీపీలో చేరారు.