ఏడాది పాలన సందర్భంగా చంద్రబాబు పచ్చి అబద్దాలు

సూపర్ సిక్స్ అమలు చేసేశామని నిస్సిగ్గుగా ప్రకటన

ప్రజలకు ఏ పథకం అమలు చేశారో వివరణ ఇవ్వాలి

కూటమి మోసాలను గణాంకాలతో సహా బయటపెట్టిన మాజీ మంత్రి బుగ్గన  

హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

వైయస్ఆర్‌సీపీ హయాంలో అన్ని హామీలు అమలు

కూటమి పాలనలో హామీలు ఎగ్గొట్టడమే లక్ష్యం

వైయస్ఆర్‌సీపీ హాయాంలో ఆదాయం పెరిగి, అప్పులు తగ్గాయి

కూటమి హయాంలో అప్పులు పెరిగి, ఆదాయం తగ్గింది

ఇంత అసమర్థ పాలన ఎక్కడా చూడలేదు

మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం

హైదరాబాద్: ఏడాది కూటమి పాలనలో చంద్రబాబు నిస్సిగ్గుగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేశానంటూ పచ్చి అబద్దాలు మాట్లాడారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండపడ్డారు. హైదరాబాద్‌ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ పాలనలో అప్పులు తగ్గి, ఆదాయం పెరిగితే, కూటమి ఏడాది పాలనలో ఆదాయం తగ్గి, అప్పులు పెరిగాయంటూ సాధికారికంగా పూర్తి ఆధారాలను, గణాంకాలను వెల్లడించారు. వాస్తవాలను దాచిపెట్టి, అద్భుతమైన పాలనను అందించామని, హామీలపై ఎవరైనా ప్రశ్నిస్తే సహించనంటూ చంద్రబాబు బెదిరింపులకు దిగడం ఆయన దిగజారుడుతనంకు నిదర్శనమని ధ్వజమెత్తారు. తాను వెల్లడించిన గణాంకాలు వాస్తవం కాదు అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. 

ఇంకా ఆయనేమన్నారంటే..

తల్లికి వందనం స్కీమ్ ప్రారంభం, ఏడాది పాలన పూర్తి సందర్భంగా చంద్రబాబు మీడియా ద్వారా పలు అబద్దాలను మాట్లాడారు. సూపర్‌సిక్స్‌ హామీలను అమలు చేసేశామంటూ, దానిపై మాట్లాడినే నాలుక మందం అంటూ ప్రతిపక్షంతో పాటు ప్రజలకు కూడా హెచ్చరిక వ్యాఖ్యలు చేశారు. నిత్యం ఆర్థికశాఖపై ముఖ్యమంత్రే సమీక్ష చేస్తుంటే, ఇక ఆర్థికశాఖ మంత్రి ఏం చేస్తున్నారు? ఎక్సైజ్ రెవెన్యూ తాకట్టు పెట్టలేదని మాట్లాడుతున్న చంద్రబాబు రాష్ట్రానికి చెందిన మొత్తం ఖనిజ సంపదను రూ.9000 కోట్లకు తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వరంగ ఖనిజాభివృద్ధి సంస్థ ఏపీఎండీసీకి 300 పైచిలుకు మైనింగ్ లీజులు అప్పచెప్పి, వాటిపై అప్పులు తీసుకుంటున్న విషయం నిజం కాదా? చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర ఖజానానే అప్పులు ఇచ్చిన వారికి హామీగా పెట్టి, రాష్ట్ర ఖజానా నుంచి నేరుగా డబ్బు తీసుకునేందుకు అనుమతించలేదా? 

పథకాల అమలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నాం 

ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్ధికి రూ.15వేల చొప్పున 87 లక్షల మందికి ఇస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేశారు. నేడు దానిలో 30 లక్షల మందికి ఎగ్గొట్టారు. అలాగే ఇస్తున్న అరకొర కూడా కేవలం రూ.13వేలు మాత్రమే ఇస్తున్నారు. యాబై ఏళ్ళ నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు నెలకు రూ.4000 చొప్పున పెన్షన్ ఇస్తామన్నారు. ఆడబిడ్డ నిధి కింద 2.07 కోట్ల మందికి నెలకు రూ.1500 ఇస్తామన్నారు. రాష్ట్రంలో 53.50 లక్షల మంది రైతులకు రైతుభరోసా కింద రూ.20వేలు ఇస్తామన్నారు. ఇందుకు ఏడాదికి రూ.10వేల కోట్లకు పైగా అవసరం కాగా, కేవలం రూ.1000 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించారు. ఉద్యోగం రాని యువతకు నెలకు రూ.3000, మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం, రాష్ట్రంలోని 1,54,047 మందికి ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితం అని ఊదరగొట్టారు. వాటిని ఎప్పుడు ఇస్తారని నేడు ప్రజలు అడుగుతున్నారు. ప్రజల తరుఫున ప్రతిపక్షంగా వాటినే వైయస్ఆర్‌సీపీ అడుగుతోంది. వాటికి సమాధానంగా అన్ని సూపర్ సిక్స్ హామీలను ఇచ్చేశానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉంది. పెర్ఫార్మెన్స్‌ వర్సెస్ ప్రామిస్ అనే అంశంపై కూటమి ప్రభుత్వం చేస్తున్న దానిని ఒక కేస్‌ స్టడీగా తీసుకోవచ్చు.

బడ్జెట్, వ్యయాలు, సంక్షేమ లెక్కలివి

 వైయస్ఆర్‌సీపీ హయాంలో సంక్షేమ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటించి ప్రతినెలా పథకాలను నిర్ధిష్టమైన తేదీల్లో అమలు చేశాం. కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ పథకాలను క్రమం తప్పకుండా అమలు చేసిన ఘనత వైయస్ జగన్‌కు దక్కుతుంది. సూపర్ సిక్స్ అంటూ చెప్పుకునే చంద్రబాబు మొదటి బాల్‌లోనే ప్రజల దృష్టిలో అవుట్ అయ్యారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాం 2023-24లో బడ్జెట్ రూ.2,35,780 కోట్లు. 2024-25లో కూటమి ప్రభుత్వ బడ్జెట్ రూ.2,45,076 కోట్లు. అంటే మా కంటే కూటమి ప్రభుత్వం రూ.10వేల కోట్లు బడ్జెట్‌ ఎక్కువగా పెట్టింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏడాదికి జీతాల కోసం వెచ్చించింది రూ. 52వేల కోట్లు. పెన్షన్లు రూ. 21,500 కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.29,500 కోట్లు, ఇవ్వన్నీ కలిపితే మొత్తం రూ.1,03,000 మా హయాంలో చేసిన వ్యయం. మూలధనం పెట్టుబడి కింద చేసిన వ్యయం రూ.23,300 కోట్లు. మొత్తం బడ్జెట్‌ రూ. 2,35,780 కోట్లలోనే జీతాలు, పెన్షన్లు, వడ్డీలకు చేసిన వ్యయంను తీసేస్తే మిగిలిన నిధులు సుమారుగా రూ.1,09,000 కోట్లు. ఈ నిధుల నుంచే వైయస్ జగన్ గారు ప్రకటించిన అన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశాం. అలాగే కూటమి ప్రభుత్వంలో కూడా అన్ని వ్యయాలు, మిగులు నిధులు, వాటిని ఎలా ఖర్చు చేస్తున్నారో ఒక సారి చూద్దాం. కూటమి ప్రభుత్వం జీతాల కోసం ఖర్చు చేసింది రూ.59 వేల కోట్లు, పెన్షన్లు రూ.27 వేల కోట్లు, వడ్డీ చెల్లింపులు రూ.31వేల కోట్లు, ఇవ్వన్నీ కలిపితే కూటమి హయాంలో చేసిన వ్యయం మొత్తం రూ.1,18,000 కోట్లు. కూటమి ప్రభుత్వంలో చేసిన మూలధన పెట్టుబడి వ్యయం రూ.19వేల కోట్లు. కూటమి ఏడాది బడ్జెట్‌లోంచి జీతాలు, వడ్డీలు, పెన్షన్లకు చేసిన వ్యయం తీసేస్తే మిగిలిన నిధులు మొత్తం రూ. 1,07,000 కోట్లు. మరి ఇన్ని నిధులు ఉండి కూడా ఎందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదో చంద్రబాబు వివరణ ఇవ్వాలి. కేవలం కూటమి ప్రభుత్వంలో హామీల్లో అమలు చేసింది ఒక్క వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడం తప్ప మరొకటి కనిపించడం లేదు. 

ఏడాదిలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత

ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అంటున్న పవన్ కళ్యాణ్‌ ఎందుకు దీనిపై మౌనంగా ఉన్నారు? వైయస్ఆర్‌సీపీ హయాంలో ఏడాది బడ్జెట్‌, కూటమి ఏడాది బడ్జెట్‌ను భేరీజు వేసుకుంటే నిధులను ఎలా వినియోగిస్తున్నారో అర్థమవుతుంది. ఇంత స్పష్టంగా మేం లెక్కతో సహా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను అన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నాం. కూటమి ప్రభుత్వంలో అన్ని దుకాణాలు వెలవెలపోతుంటే, ఒక్క మద్యం దుకాణాలు మాత్రమే కళకళలాడుతున్నాయి. గ్రామాల్లో వ్యాపారాల కోసం కాల్‌ మనీ నుంచి ఫైనాన్స్ తీసుకుని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఏడాది కూటమి పాలనపై కేకే సర్వేలోనే తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందని తేల్చి చెప్పారు.  

అప్పులకు సంబంధించిన వాస్తవాలివి

అప్పులపైన చంద్రబాబు ఎన్నికల ముందు అనేక అబద్దాలను చెప్పారు. తన అబద్దాలు బయటపడతాయని అప్పుల గురించి బడ్జెట్‌ బుక్ లో రాకుండా డాక్యుమెంట్‌ను విడుదల చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. అప్పుల గురించి వాస్తవాలను చూస్తే, రాష్ర్ట విభజన జరిగిన నాడు ఉన్న అప్పు రూ.1,40.717 కోట్లు. తెలుగుదేశం ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2019 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.3,90,247 కోట్లు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. అంటే సీఏజీఆర్ ప్రకారం చూస్తే 22.63 శాతం ఎక్కువగా అప్పులు చేశారు.  వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే 2024 నాటికి ఉన్న మొత్తం రాష్ట్ర అప్పులు రూ.7,21,918 కోట్లు. అంటే అయిదేళ్ళ వైయస్ఆర్‌సీపీ పాలనలో చేసిన అప్పులు కేవలం రూ.3,32,671 కోట్లు. వైయస్ఆర్‌సీపీ హయాంలో సీఏజీఆర్ 13.5శాతం మాత్రమే. ఇవ్వన్నీ కాగ్ నివేదికలో ఉన్న లెక్కలు. వీటిని వక్రీకరిస్తూ వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చంద్రబాబు విష ప్రచారం చేశారు. శ్రీలకం, కంబోడియాగా ఏపీని మార్చేస్తున్నారంటూ దిగజారుడు ప్రచారం చేశారు. 

సంపద సృష్టి అంటే ఇదేనా?

సంపద సృష్టిస్తానంటూ చంద్రబాబు హామీలు ఇచ్చారు. వైయస్ఆర్సీసీ పాలనలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం రూ.1,57,768 కోట్లు, అలాగే 2023-24లో రూ.1,73,767 కోట్లు. అంటే ఈ రెండు సంవత్సరాల ఆదాయం చూస్తే పదిశాతం ఆదాయం పెరిగింది. ఏడాది అప్పులు చూస్తే 19 శాతం మాత్రమే పెరిగాయి. అదే కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలోనే అప్పులు 30 శాతం పెంచితే, ఆదాయం మాత్రం కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. ఇదేనా చంద్రబాబు సంపద సృష్టి? 2024 ఏప్రిల్ నాటికి రాష్ట్ర జీఎస్టీ ఆదాయం రూ. 3500 కోట్లు అయితే, 2025 ఏప్రిలో నాటికి వచ్చిన రాష్ట్ర జీఎస్టీ రూ. 2652 కోట్లు అంటే, 24 శాతం తక్కువగా వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రానికి సంబంధించిన పన్ను ఆదాయం 2024లో రూ.7483 కోట్లు కాగా, 2025లో వచ్చిన ఆదాయం రూ. 6569 కోట్లు. అంటే 12 శాతం ఆదాయం పడిపోయింది. పన్నేతర ఆదాయం ఏప్రిల్ 2024లో రూ.442 కోట్లు అయితే, 2025 ఏప్రిల్ నాటికి రూ. 345 కోట్లు. అంటే 22 శాతం తక్కువ. ఏప్రిల్ 2024లో పన్ను, పన్నేతర ఆదాయం కలిపి లెక్కేస్తే రూ. 7925 కోట్లు కాగా, 2025 ఏప్రిల్ నాటికి వచ్చిన మొత్తం ఆదాయం రూ. 6914 కోట్లు. అంటే పన్నెండు శాతం తక్కువ. 

ఉద్యోగుల సొమ్మును వాడేశారు

ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, డీఏల అమలు ఏదీ? రాష్ట్ర విభజన జరిగినప్పుడు మొత్తం పబ్లిక్ అకౌంట్ లయబెలిటీస్ రూ.32,997 ఉంది. అందులో ఏపీ భాగం 19,138 కోట్లు. 2014-19 నాటికి రూ.76,516 కోట్లు. అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సొమ్మును రూ.57,378 కోట్లు అదనంగా వాడుకున్నారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న పబ్లిక్ అకౌంట్ లయబెలిటీస్ రూ. 76,038 కోట్లు, అంటే మేం ఉద్యోగుల సొమ్మును వాడుకోకపోగా రూ.478 కోట్లు తిరిగి జమ చేశాం. కానీ ఉద్యోగులకు మా ప్రభుత్వంపై విష ప్రచారం చేశారు. 

రాష్ట్రంలో అరాచక పాలన

జనాభాను పెంచండి, చూసుకునే బాధ్యత నాదేనని చంద్రబాబు పదేపదే చెప్పారు. ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటీ? ఏడాది పాలన తరువాత కూటమి ప్రభుత్వంలో ప్రజలను బెదిరిస్తున్నారు, ప్రభుత్వం భయపడుతోంది. ఏడాదిలో రాష్ట్రంలో అరాచకం సృష్టించారు. చివరికి ప్రశ్నించే జర్నలిస్ట్‌లను కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వేధించారు. కొమ్మనేని శ్రీనివాసరావు వంటి సీనియర్ పాత్రికేయుడి పట్ల దుర్మార్గంగా చంద్రబాబు వ్యవహరించారు.

Back to Top