అసెంబ్లీ: స్కూల్ ఆయాలకు గత తెలుగుదేశం ప్రభుత్వం కేవలం రూ.1000 వేతనం మాత్రమే ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అరకొర జీతాలు చెల్లించి రూ.160 కోట్ల బకాయిలుపెట్టి వెళ్లిందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. సభలో ప్రతిపక్షం అడిగిన ప్రశ్నకు మంత్రి ఆదిమూలపు సురేష్ ఆధారాలతో సమాధానమిచ్చారు. గత టీడీపీ హయాంలో స్కూల్కు ఒక్క ఆయా మాత్రమే ఉంటే.. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయాలను నియమించామని చెప్పారు. 300 విద్యార్థులకు ఒక ఆయా, 600 విద్యార్థులు ఉంటే ఇద్దరూ, 900 మందికంటే ఎక్కువ ఉంటే నలుగురి ఆయాలను నియమించామని చెప్పారు. టీడీపీ కేవలం జిల్లా పరిషత్ స్కూళ్లలో మాత్రమే ఆయాలను నియమించిందని, కానీ, వైయస్ జగన్ ప్రభుత్వం రెసిడెన్షియల్, గిరిజన వెల్ఫేర్ స్కూల్, గురుకుల, బీసీ, సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో 45 వేల మందిని నియమించామని చెప్పారు. టీడీపీ నెలకు కేవలం 1000 మాత్రమే ఆయాలకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా..? అని ప్రశ్నించారు. 2019లో ఎన్నికలు వస్తున్నాయని జీతాలు పెంచి వచ్చే ప్రభుత్వానికి వదిలేశారన్నారు. రూ.1000 వేతనం ఉంటే సుప్రీం కోర్టు అక్షింతలు వేసిన తరువాత ప్రైమరీ స్కూల్కు రూ.2 వేలు, అప్పర్ ప్రైమరీకి రూ.2500, హైస్కూల్కు రూ.4 వేలు పెంచారని గుర్తుచేశారు. వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం వచ్చాక అందరికీ ఒకేలా రూ.6000 పెంచడం జరిగిందన్నారు. 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం కేవలం ఒక్కసారే రూ.45 కోట్లు ఇచ్చి రూ.160 కోట్లు బకాయిలు పెట్టివెళ్లిందన్నారు. ఆ బకాయిలను కూడా వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం చెల్లించిందన్నారు. టీడీపీ హయాంలో ఆయా జీతంలోనే క్లీనింగ్ మెటీరియల్ కూడా తీసుకునేవారు. తాము జీతాలు కాకుండా క్లీనింగ్ మెటీరియల్, ఎయిర్ ఫ్రెష్నర్స్తో సహా అందజేస్తున్నామన్నారు. టాయిలెట్ల నిర్వహణ ఏ విధంగా ఉండాలనే దానిపై వివరంగా ఒక బుక్ను తయారు చేశాం. రోజుకు నాలుగుసార్లు టాయిలెట్స్ క్లీన్ చేసి.. లాక్షీట్ మెయిన్టైన్ చేయాలని సూచించామన్నారు. విద్యా కానుక ప్రారంభోత్సవంలో, తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరంలో టాయిలెట్ల నిర్వహణను ముఖ్యమంత్రి వైయస్ జగన్ పరిశీలించారని చెప్పారు. టాయిలెట్ల క్లీనింగ్ కోసం యాప్ను కూడా వినియోగిస్తున్నాం. అంతేకాకుండా టోల్ఫ్రీ నంబర్ను కూడా ఏర్పాటు చేశామన్నారు. జీతాలు ఆయాల అకౌంట్లోకే ట్రాన్స్ఫర్ చేసేలా చర్యలు తీసుకున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ వివరించారు. కరోనా లాంటి విపత్కర సమయంలో స్కూళ్లు మూతపడినా కూడా మానవతా దృక్పథంతో ఆరునెలల పాటు వెయ్యి రూపాయల చొప్పున జీతాలు కూడా చెల్లించామన్నారు. ఆయాలను నియమించడం, నాడు–నేడుతో టాయిలెట్స్ ఆధునీకరించడం వల్ల బాలికల డ్రాప్ అవుట్ రేషియో తగ్గిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.400 కోట్లతో టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఫండ్ను ఏర్పాటు చేశామని మంత్రి వివరించారు.