తాడేపల్లి: విద్యార్థుల భవిష్యత్ కోసమే టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తుననామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కోవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ‘మనబడి నాడు–నేడు’పై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘నిన్న కేరళలో టెన్త్ పరీక్షలు పూర్తిచేశారు. టెన్త్ ఇంటర్ పరీక్షలల నిర్వహణపై కేంద్రం ఎలాంటి విధానాలు ప్రకటించలేదు. పరీక్షల నిర్ణయాన్ని కేంద్రం.. రాష్ట్రానికే వదిలేసింది. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తే.. మరికొన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేశాయి. పరీక్షలు పెట్టని రాష్ట్రాలు విద్యార్థులకు కేవలం పాస్ మార్కులే ఇస్తున్నాయి. అదే పరీక్షలు జరిగితే విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. మంచి మార్కులు లేకపోతే మంచి కాలేజీల్లో సీట్లు ఎలా వస్తాయి..? పాస్ మార్కులతో బయటపడ్డ విద్యార్థుల భవిష్యత్ ఏంటి..? విద్యార్థులకు మంచి చేయాలన్న తపనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కోవిడ్ జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు నిర్వహించాలి’ అని ఉన్నతాధికారులను సీఎం వైయస్ జగన్ ఆదేశించారు.