ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదు

గోదావరి వరదలపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమీక్ష 

మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలి

వ‌ర‌ద బాధిత కుటుంబాల‌కు నిత్యావ‌స‌ర స‌రుకులు అందించండి

తాడేప‌ల్లి: వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పష్టం చేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలన్నారు. గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. 
 
మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం తెలిపారు. ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆదేశించారు.

Back to Top