ప్రజలందరి చల్లని దీవెనలతో రెండేళ్ల పాలన పూర్తి

అక్షరాల రూ.1,31,725 కోట్లు ప్రజా సంక్షేమానికి వెచ్చించాం

ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకే నగదు జమ చేశాం

రాష్ట్రంలోని 86 శాతం ఇళ్లకు సంక్షేమ పథకాలు అందించాం

66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మల పేరుమీదే అమలు చేస్తున్నాం 

రెండేళ్లు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు

రెండేళ్ల సంక్షేమ పాలనపై బుక్‌ విడుదల చేసిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: ప్రజలందరి చల్లని దీవెనలతో రెండు సంవత్సరాల మనందరి ప్రభుత్వ పాలన పూర్తిచేసుకోగలిగామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ రాష్ట్రంలో 1,64,68,591 ఇళ్లు ఉంటే.. 1,41,52,386 ఇళ్లకు (86 శాతం) దేవుడి దయతో ఏదో ఒక సంక్షేమ పథకం చేరిందన్నారు. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.95,528 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని, మరో 36,197 కోట్లు వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ, గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, జగనన్న తోడు, సంపూర్ణ పోష్ణ, ఇళ్ల స్థలాలు, వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా ప్రజలకు అందించామన్నారు. రెండూ కలుపుకొని అక్షరాల రూ.1,31,725 కోట్లు వ్యవస్థల్లో మార్పులు తీసుకువచ్చి ఎటువంటి లంచాలు, వివక్ష లేకుండా.. నేరుగా ప్రజలకు అందించగలిగామని,  ఇంత గొప్ప అవకాశం, గొప్ప పరిపాలన దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో చేయగలిగానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. 

రెండేళ్ల పరిపాలన పూర్తిపై రెండు డాక్యుమెంట్లను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. ఒకదాంట్లో ఒక్కో కుటుంబానికి అందించిన సంక్షేమ పథకాలు, మరో డాక్యుమెంట్లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశాం.. అమలుకు చర్యలు తీసుకుంటున్న వాటిపై వివరణ ఇస్తూ ఉంటుంది. ఈ రెండు డాక్యుమెంట్లను వలంటీర్ల ద్వారా ప్రతి గడపకూ పంపిస్తామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

ఈ సంద‌ర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏం మాట్లాడారంటే..

ప్రతి గ్రామ వలంటీర్, గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న సోదరులు, చెల్లెమ్మలకు, ప్రభుత్వ యంత్రాంగంలోని కలెక్టర్ల వరకు ప్రతి ఒక్కరి సహకారంతో ప్రజలకు ఇంత మంచి చేయగలిగాం. వీరందరికీ కృతజ్ఞతలు. దేవుడి దయతో చేయగలిగిన మంచిని వివరిస్తూ.. రెండు డాక్యుమెంట్లను ప్రతి ఇంటికి గ్రామ వలంటీర్ల ద్వారా చేర్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. శ్రీకాకుళం జిల్లా, జీశగడం, వడ్రంగి గ్రామ సచివాలయ పరిధిలో నివసించే కంది ఆదిలక్ష్మి అక్కకు, ఆ కుటుంబానికి జరిగిన మేలు వివరిస్తూ రాసిన పుస్తకాన్ని మొదటగా విడుదల చేస్తున్నా.. ఏయే కుటుంబాలు అందించామో చూపిస్తూ డాక్యుమెంట్‌ తయారుచేస్తున్నాం. రెండేళ్లకాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశంపై ఏమేమి చేయగలిగాం అని చెప్పి ప్రతి అక్కకు లెక్కలతో సహా తెలియజేస్తున్నాం.

మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి.. రెండు సంవత్సరాల పరిపాలనలో అందులోని ప్రతి అంశం పూర్తి చేయడానికి ప్రతి అడుగు వేశాం. ఎన్నికల సమయంలో రెండు పేజీల మేనిఫెస్టో ప్రింట్‌ చేశాం. మేనిఫెస్టోలో ఏయే అంశాలను అమలు చేశాం.. ఏయే అంశాల అమలుకు అడుగులు పడ్డాయి.. మేనిఫెస్టోలో చెప్పని అంశాలు ఎన్ని అమలు చేశామని ప్రతీది టిక్కుపెట్టి వివరణ ఇస్తూ మరో డాక్యుమెంట్‌ను ప్రతి ఇంటికి పంపిస్తున్నాం. 

రెండు సంవత్సరాల్లో 94.5 శాతం హామీలను అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో పూర్తిచేశామని గర్వంగా తెలియజేస్తున్నాను. 66 శాతం పథకాలు అక్కచెల్లెమ్మలకే చెందుతున్నాయి. ప్రతి పథకం అక్కచెల్లెమ్మకు వెళ్లడం, ఆ డీటైల్స్‌ ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నాం. ఈ రెండు సంవత్సరాల కాలంలో తోడుగా నిలబడినందుకు రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సోదరులు, స్నేహితులకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రాబోయే మూడు సంవత్సరాల్లో కూడా ప్రతి ఆశను నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేసేందుకు శక్తిని ఇవ్వాలని దేవుడ్ని కోరుతున్నా.’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించి.. రెండేళ్ల సంక్షేమ పాలనపై రూపొందించిన డాక్యమెంట్లను ఆవిష్కరించారు. 
 

Back to Top