భువనేశ్వర్: `సుదీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల మధ్య పరిష్కృతం కాని అంశాలున్నాయి. తొలిసారిగా ఈ అంశాలను పరిష్కరించడానికి అడుగు ముందుకేశాం. ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు కావడం సంతోషకరంగా ఉంది` అని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చీఫ్సెక్రటరీలతో ఏర్పాటయ్యే కమిటీ సమస్యల మూలాల్లోకి వెళ్తుందదని, వాటికి పరిష్కార మార్గాలను కనుక్కుంటుందన్నారు. చర్చలు జరపడమే కాదు, జాయింట్ కమిటీ ఏర్పాటుకు ముందుకు వచ్చినందుకు ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్కు, ఒడిశా ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర అధికారులకు సీఎం వైయస్ జగన్ ధన్యవాదాలు తెలిపారు. కలకట్టుగా, సహకార ధోరణితో సమస్యలను పరిష్కరించుకుంటామని, రెండు రాష్ట్రాల ప్రజల విశాల ప్రయోజనాలే ధ్యేయమని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో ముఖ్యమంత్రి వైయస్ భేటీ ముగిసింది. ఒడిశా సచివాలయం లోక్సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్న ఏపీ సీఎం వైయస్ జగన్కు ఒడిశా సీఎం సాదరస్వాగతం పలికారు. అనంతరం కన్వెన్షన్ రూంలో ఇరువురి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. తర్వాత కాన్ఫరెన్స్హాల్లో రెండు రాష్ట్రాల అధికారులతో కలిసి ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీలతో జాయింట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రులు ప్రకటించారు. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాలు అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సీఎం వైయస్ జగన్ పర్యటన సాగిందిలా.. ఈరోజు ఉదయం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరైన సీఎం వైయస్ జగన్.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అక్కడ నుంచి విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో భువనేశ్వర్ చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా ఒడిశా స్టేట్ గెస్ట్ హౌస్కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేరుకున్నారు. స్టేట్గెస్ట్ హౌస్లో సీఎంకు ఒడిశాలోని తెలుగు సంఘాల ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మరో దఫా స్వల్ప సమావేశం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఒడిశా సచివాలయం లోక్సేవా భవన్ కన్వెన్షన్ సెంటర్కు ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేరుకున్నారు. సీఎం వైయస్ జగన్కు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సాదర స్వాగతం పలికారు. అనంతరం కన్వెన్షన్ రూంలో ఇరువురి మధ్య ఆత్మీయ సమావేశం జరిగింది. కాన్ఫరెన్స్హాల్లో రెండు రాష్ట్రాల అధికారులతో ముఖ్యమంత్రుల చర్చ ప్రారంభమైంది. ఇరు రాష్ట్రాల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చీఫ్ సెక్రటరీలతో జాయంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రకటించారు. సమస్యల పరిష్కారంపై ఈ కమిటీ దృష్టిపెడుతుందని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. చర్చించిన అంశాలు.. – కొఠియా గ్రామాల సమస్య, నేరడి బ్యారేజీ, జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టులో మిగిలిపోయిన భాగం పూర్తి లాంటి మూడు ప్రధాన అంశాలతో పాటు వివిధ అంశాలమీద చర్చ జరిగినట్టుగా వెల్లడి. – పోలవరం కారణంగా పాక్షికంగా ముంపునకు గురవుతున్న ప్రాంతంలో రక్షణ చర్యలపై సూచనలు చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్. – బలిమెల, అప్పర్ సీలేరులో విద్యుత్ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ఓసీ అంశాలు. బహుదా రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురానికి నీటి విడుదలపైన చర్చలు. – ఈ అంశాలపై దృషిసారించడానికి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి జాయింట్కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఏపీ సీఎం వైయస్.జగన్ – రెండు రాష్ట్రాలకు చెందిన చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటవుతుందని వెల్లడి – దీనికి సంబంధించి అధికారికంగా సంయుక్త ప్రకటన విడుదల చేసిన రెండు రాష్ట్రాలు – మావోయిస్టు కార్యకలాపాల నియంత్ర, గంజాయి సాగు, రవాణా నివారణపైనా సహకారం కొనసాగించాలని, కలకట్టుగా ఎదుర్కోవాలని ప్రకటనలో పేర్కొన్న ఇరు రాష్ట్రాలు. – సరిహద్దు జిల్లాల్లో ఒడిశాలో తెలుగు, ఆంధ్రలో ఒడియాకు సంబంధించి లాంగ్వేజ్ టీచర్ల నియామకం, పాఠ్యపుస్తకాల పంపిణీ, పరీక్షలు నిర్వహణను సోదరభావం పెంపొందించేందుకు చేపట్టాలని నిర్ణయం. – ఈదిశగా అడుగులు వేయడానికి శ్రీకాకుళం జిల్లాలోని డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, బరంపురం యూనివర్శిటీల ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయం.