అమ్మ క‌డుపులో బిడ్డ నుంచి అవ్వ‌ల దాకా సంక్షేమ ప‌థ‌కాలు

వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం ప్రారంభోత్స‌వంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  

 చెప్పిన మాట ప్ర‌కారం అక్క చెల్లెమ్మ‌ల‌కు వైయ‌స్ఆర్ ఆస‌రా 

నాలుగు విడ‌త‌ల్లో వైయ‌స్ఆర్ ఆస‌రా సొమ్ము బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌

మొద‌టి విడ‌త‌గా రూ.6,792 కోట్లు ఇవాళ బ్యాంకు ఖాతాల్లో జ‌మ‌

మ‌హిళ‌ల అభ్యున్న‌తికి క‌ట్టుబ‌డి ఉన్నాం

ఇది మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వం

త్వ‌ర‌లోనే 30 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌ల‌కు ఇళ్ల పట్టాలు

 తాడేప‌ల్లి: అమ్మ క‌డుపులో బిడ్డ నుంచి అవ్వ‌ల వ‌ర‌కు అంద‌రికీ కూడా సంక్షేమం అందాల‌ని,  ప‌సి పిల్ల‌ల నుంచి అవ్వ‌ల వ‌ర‌కు ఈ ప్ర‌భుత్వం సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తుంద‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని మ‌హిళ‌ల చ‌రిత్ర‌ను తిర‌గ‌రాయ‌డానికి వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కాన్నిప్రారంభిస్తున్నామ‌ని చెప్పారు. తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా క‌లెక్ట‌ర్లు, పొదుపు మ‌హిళ‌ల‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి నిర్వ‌హించారు. ముఖ్య‌మంత్రి ప్ర‌సంగం ఇలా..

రాష్ట్రంలోని అక్క‌చెల్లెమ్మ‌లంద‌రికీ పేరు పేరున హృద‌య పూర్వ‌క శుభాకాంక్ష‌లు. ఈ కార్య‌క్ర‌మం అన్న‌ది బ‌హుష ఇంత స్థాయిలో..ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌ల‌పెట్ట‌లేదు. దేవుడి ద‌య‌, మీఅంద‌రి చ‌ల్ల‌ని దీవెన‌ల‌తో ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తున్నా. దేవుడి ద‌య‌తో మీ అంద‌రికి ఇచ్చిన మాటను నిల‌బెట్టుకుంటూ ఎన్నిక‌ల నాటికి ఎంతైతే బ్యాంకుల్లో రుణాలు బ‌కాయిలు ఉన్నాయో అంతా కూడా నాలుగు ద‌ఫాలుగా చెల్లిస్తున్నాం. ఇవాళ మొద‌టి విడ‌త‌గా చెల్లిస్తున్నాం. ఎన్నిక‌ల నాటికి రూ.27 వేల కోట్లు అప్పులు ఉన్నాయి. చెప్పిన ఈమాట ప్ర‌కారం నాలుగు వాయిదాల్లో అక్క‌చెల్లెమ్మ‌ల‌కు వైయ‌స్ఆర్ ఆస‌రా ప‌థ‌కం కింద మొద‌టి విడ‌త‌గా రూ.6,792 కోట్లు ఇవాళ జ‌మ చేస్తున్నాం. మీ కాళ్ల మీద మీరునిల‌బ‌డేందుకు ఈ డ‌బ్బును మీ గ్రూపు ఖాతాల్లో జ‌మ చేస్తున్నాం. పెద్ద పెద్ద కంపెనీల‌తో ప్ర‌భుత్వం ఒప్పందాలు చేసుకుంది. మీకు శిక్ష‌ణ‌, సాంకేతిక స‌హ‌కారం అందిస్తారు. త‌క్కువ ధ‌ర‌ల‌కు వ‌స్తువులు అందించ‌డం కోసం ఒప్పందాలు చేసుకున్నాం. ఇప్ప‌టికే చేయూత ప‌థ‌కానికి వ‌ర్తింప‌జేశాం. 

వైయ‌స్ఆర్  చేయూత ప‌థ‌కంలో అక్క చెల్లెమ్మ‌లు ఎవ‌రైనా డ‌బ్బు తీసుకుని వ్యాపారం చేసుకునేందుకు దోహ‌ద ప‌డుతుంది.ఇదేమాదిరిగా మీరు కూడా ఏదైనా వ్యాపారం చేసుకోవాల‌నుకుంటే ఈ డ‌బ్బు ఉప‌యోగ‌ప‌డుతుంది. మీరు ఈ డ‌బ్బుకు సంబంధించి మెప్మ అధికారులు, సెర్ఫ్ అధికారుల‌ను సంప్ర‌దిస్తే స‌రిపోతుంది. లేదా 1904 నంబ‌ర్‌కు ఫోన్ చేస్తే మీకు స‌మాచారం ఇస్తారు. వాలంటీర్లు కూడా మీకు స‌హ‌కారం అందిస్తారు. మేలు జ‌రిగేలా కంపెనీలు, బ్యాంక‌ర్ల‌తో మాట్లాడుతారు.
అక్క చెల్లెమ్మ‌ల‌కు అన్నిర‌కాలుగా ప‌రిస్థితులు మెరుగు కావ‌డానికి ఈ ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా, రాజ‌కీయంగానూ మ‌హిళా సారికాత కోసం దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఈ ప్ర‌బుత్వం అడుగులు వేస్తోంది. ఈ అడుగులు ఎక్క‌డ నుంచి మొద‌ల‌వుతున్నాయ‌ని ఒక్క‌సారి గ‌మ‌నిస్తే..అమ్మ క‌డుపులో బిడ్డ నుంచి అవ్వ‌ల వ‌ర‌కు అంద‌రికీ కూడా సంక్షేమం అందాలి. అంద‌రికీ కూడా మంచి జ‌ర‌గాల‌ని వివిధ ప‌థ‌కాలు 15 నెల‌ల కాలం నుంచి తీసుకువ‌స్తున్నాం. 

గ‌ర్భిణులు, బాలింత‌లు, బిడ్డ క‌డుపులో ప‌డిన నాటి నుంచి  ఆరేళ్ల పిల్ల‌ల వ‌ర‌కు అమ్మ‌తో పాటు పేదింటి పిల్ల‌ల సంర‌క్ష‌ణ‌కు కొద్ది రోజుల కింద‌టే వైయ‌స్ఆర్ సంపూర్ణ పోష‌ణ ప‌థ‌కాన్ని మ‌న ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చింది. త‌ల్లికి, బిడ్డ‌కు పౌష్టికాహారం అందించ‌డం, వ‌చ్చే త‌రానికి అవ‌స‌ర‌మైన ఇంగ్లీష్ మీడియంను అంగ‌న్‌వాడీ కేంద్రాల్లో  ఫ్రీ పైమ‌రీ కేంద్రాల్లో తీసుకురావ‌డం వంటి మార్పులు చేశాం. ఆ త‌ల్లుల‌కు అవ‌స‌ర‌మైన పోష‌కాల‌తో కూడిన ఆహారం ఇవ్వ‌డం మ‌న ప్ర‌భుత్వం అన్నిర‌కాలుగా శ్రీకారం చుట్టింది. 

ఆరేళ్ల పిల్ల‌ల నుంచి ఇంట‌ర్‌మీడియ‌ట్ వ‌ర‌కు ఆ పిల్ల‌లు చ‌దువుకునేందుకు, మ‌న పిల్ల‌లు కూడా పెద్దింటి పిల్ల‌ల మాదిరిగా ఇంగ్లీష్‌చ‌దువులు అందాల‌ని, డాక్ట‌ర్లు, ఇంజినీర్లుగా మ‌న పిల్ల‌లు గొప్ప‌గా రాణించాల‌ని అమ్మ ఒడిఅనే ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చాం. ఈ ప‌థ‌కం ద్వారా ఏటా అక్క చెల్లెమ్మ‌ల‌కు తోడుగా, పిల్ల‌ల‌కు మంచి మేన‌మామ‌గా దాదాపుగా 43 ల‌క్ష‌ల మందిత‌ల్లుల ఖాతాలో ఏటా రూ.15 వేల చొప్పున జ‌మ చేస్తున్నాం. 83 ల‌క్ష‌ల మంది పిల్ల‌ల‌కు మేలు జ‌రిగింది. అలాగే ఇంట‌ర్‌మీడియ‌ట్ వ‌ర‌కు మ‌ధ్య‌లో చ‌దువులు ఆప‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో, కుటుంబాలు పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు విద్యా దీవెన అనే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాం. పెద్ద చ‌దువుల‌కు అయ్యే ఖ‌ర్చులు మొత్తం ప్ర‌భుత్వ‌మే 
భ‌రించేలా చూస్తున్నాం. 
పూర్తి ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చాం. గ‌త ప్ర‌భుత్వ పెట్టిన రూ.1800 కోట్ల బ‌కాయిల‌ను మ‌న‌మే చెల్లించాం. అప్ప‌ట్లో చాలీచాల‌ని విధంగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ ఇచ్చేవారు. ఆ బ‌కాయిలు తీర్చుతూ..దాదాపుగా రూ.4200 కోట్లు నేరుగా పిల్ల‌ల చ‌దువుల కోసం అక్క చెల్లెమ్మ‌ల‌కు ఇచ్చాం. కాలేజీల యాజ‌మాన్యాల‌తో త‌ల్లిదండ్రులే నేరుగా మాట్లాడేలా ఆ సొమ్మును అక్క చెల్లెమ్మ‌ల‌కు విద్యా దీవెన కింద చెల్లించాం.

ఇంట‌ర్ త‌రువాత పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివే వారికిఅన్నిర‌కాలుగా తోడుగా ఉండేందుకు..చ‌దువులు మ‌ధ్య‌లో ఆగిపోకూడ‌ద‌ని వ‌స‌తి దీవెన ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాం. భోజ‌నం, వ‌స‌తి కోసం ఏటా రూ.20 వేల చొప్పున అక్క చెల్ల‌మ్మ‌ల ఖాతాలో జ‌మ చేస్తున్నాం. రూ.1221 కోట్లు త‌ల్లుల ఖాతాల్లో జ‌మ చేశాం. రెండు ద‌ఫాలుగా రూ.10 వేల చొప్పున చెల్లించాం. ఈ 15 నెల‌ల కాలంలోనే ఇవ‌న్నీ కూడా చెయ్య‌గ‌లిగామ‌ని గ‌ర్వంగా చెబుతున్నా.

 పిల్ల‌లు బాగా చ‌దివితేనే పేదరికం నుంచి బ‌య‌ట‌ప‌డుతాం. ఇందుకోసం బ‌డుల్లో నాడు-నేడు కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాం. ఇంగ్లీష్ మీడియం చ‌దువులు ఏకంగా గ్రామ స్థాయికి తీసుకురాగ‌లిగాం. ఈ 15 నెల‌ల్లో అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఏమేమి చేశామ‌న్న‌ది గ‌మ‌నించాలి. 

పొదుపు సంఘాల అక్క‌చెల్లెమ్మ‌ల‌కు సున్నావ‌డ్డీ ప‌థ‌కాన్ని గ‌త ప్ర‌భుత్వాలు పూర్తిగా ఎగుర‌గొట్టాయి. మ‌న ప్ర‌భుత్వం వైయ‌స్ఆర్ సున్నా వ‌డ్డీ ప‌థ‌కం తెచ్చి..ఆ ప‌థ‌కం కింద రూ. 1400 కోట్లు అక్క చెల్లెమ్మ‌ల‌కు నేరుగా అందించాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వ‌య‌సు ఉన్న అక్క‌ల‌కు ఎలాంటి మేలు జ‌ర‌గ‌డం లేద‌ని గ‌మ‌నించి..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మ‌హిళ‌ల‌కు  ఆర్థిక చేయూత‌నందించేందుకు వైయ‌స్ఆర్ చేయూత ప‌థ‌కం ద్వారా నాలుగేళ్ల‌లో రూ.75 వేలు అందించేందుకు శ్రీ‌కారం చుట్టాం. మొద‌టి విడ‌త‌గా రూ.18,750 చొప్పున ఇప్ప‌టికే అందించాం. కార్పొరేష‌న్ల వ్య‌వ‌స్థ‌ను పూర్తిగా మార్పు చేశాం. దాదాపు 22 ల‌క్ష‌ల మంది అక్క చెల్ల‌మ్మ‌కు వైయ‌స్ఆర్ చేయూత కింద డ‌బ్బులు జ‌మ చేశాం. ఆ డ‌బ్బు ఇవ్వ‌డ‌మే కాకుండా వ్యాపార అవ‌కాశాల‌ను చూపిస్తూ..దిగ్గ‌జ సంస్థ‌ల‌తో అవ‌గాహ‌న ఒప్పందాలు చేసుకున్నాం. మ‌హిళ‌లు చేసే వ్యాపారాల‌కు మార్కెటింగ్ స‌దుపాయాలు కూడా క‌ల్పిస్తున్నాం. 

మ‌హిళ‌ల‌ను ల‌క్షాధికారులుగా చేసే దిశ‌గా అడుగులు వేస్తున్నాం. ఆవులు, గేదెలు కొనివ‌డం, గ్రామీణ ప్రాంతాల్లో చిల్ల‌ర దుకాణాలు ఏర్పాటు వంటి అవ‌కాశాలు క‌ల్పించాం. దాదాపుగా రూ.4,600 కోట్లు అక్క‌చెల్లెమ్మ‌ల బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేశాం. దేశ చ‌రిత్ర‌లో ఎక్క‌డా..ఎప్పుడూ జ‌ర‌గ‌ని విధంగా నామినేటేడు ప‌ద‌వులు, ప‌నుల్లో 50 శాతం అక్క‌చెల్లెమ్మ‌ల‌కు హ‌క్కుగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాం. ఇందుకోసం అసెంబ్లీలో చ‌ట్టం కూడా చేశామ‌ని గ‌ర్వంగా చెబుతున్నా. కాపు, తెల‌గ బ‌లిజ వంటి సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన అక్క‌ల‌కు కూడా కాపు నేస్తం కింద రూ.15వేలు అందించామ‌ని గ‌ర్వంగా చెబుతున్నాను. మిగ‌తా నాలుగేళ్లు వాళ్ల చెయ్యి ప‌ట్టుకొని న‌డిపిస్తాం. ప్ర‌తి ప‌థ‌కం అక్క‌చెల్లెమ్మ‌ల కోస‌మే ఉద్దేశించింది. వీళ్లు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంద‌ని న‌మ్మిన వ్య‌క్తిగా ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాం. 30 ల‌క్ష‌ల మంది అక్క చెల్లెమ్మ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు రిజిస్ట్రేష‌న్ చేసి వాళ్ల పేరు మీదే ఇవ్వ‌డానికి స‌ర్వం సిద్ధంగా ఉంది. కాక‌పోతే గిట్ట‌ని వాళ్లు..వాళ్ల రాజ‌కీయ పునాదులు క‌దిలిపోతాయ‌ని కొర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు పెడుతున్నారు. దేవుడి ద‌య‌, అక్క చెల్లెమ్మ‌ల దీవెన‌ల‌తో త్వ‌ర‌లోనే 30 ల‌క్ష‌ల మంది అక్క‌చెల్లెమ్మ‌ల‌కు ఇళ్ల ప‌ట్టాలు ఇచ్చి మంచి జ‌రిగేలా చూస్తాం.

ప్ర‌తి వ‌య‌సులోనూ అక్క‌చెల్లెమ్మ‌ల‌కు తోడుగా ఉంటున్నాం. 60 ఏళ్లు దాటిన ప్ర‌తి అక్క‌కు మంచి జ‌ర‌గాల‌నే ఉద్దేశంతో ఒంటరి మ‌హిళ‌లు, వితంతువుల‌కు నేరుగా వైయ‌స్ఆర్ పింఛ‌న్ కానుక అంద‌జేస్తున్నాం. గ‌తంలో 45 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే పింఛ‌న్లు ఇచ్చే వారు..ఇప్పుడు 60 ల‌క్ష‌ల మందికి పింఛ‌న్లు ఇస్తున్నాం. అది కూడా రూ.2,500 చొప్పున పింఛ‌న్లు ఇస్తున్నాం. అదికూడా ప్ర‌తి నెల 1వ తేదీ ఠంచ‌న్‌గా ఇస్తున్నాం. ఆదివారం అయినా కూడా క‌చ్చితంగా గ్రామ వాలంటీర్ నేరుగా ఇంటికే వెళ్లి పింఛ‌న్ సొమ్ము అంద‌జేస్తున్నారు. మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రిగితే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని, అందుకోసం దిశ చ‌ట్టం రూపొందించాం. 7 ప‌ని దినాల్లోనే పోలీసులు విచార‌ణ చేసి,, ఆ త‌రువాత దోషుల‌కు మ‌ర‌ణ శిక్ష కూడా విధించేలా చ‌ట్టం చేశాం. రాష్ట్ర‌ప‌తి ఆమోదం పొందాల్సి ఉంది. ప్ర‌తి అక్క చెల్లెమ్మ‌ల‌కు తోడుగా ఉండేందుకు దిశ యాప్‌ను కూడా రూపొందించామ‌ని గ‌ర్వంగా చెబుతున్నా. కుటుంబాల్లో ఆనందాలు నింపేలా అడుగులు వేస్తూ..అత్య‌ధికంగా మ‌ద్యం ధ‌ర‌లు పెంచి , దాదాపు 43 వేల బెల్టు షాపులు ర‌ద్దు చేశాం. 33 శాతం మ‌ద్యం షాపులు ర‌ద్దు చేశాం. ప్ర‌భుత్వ‌మే మ‌ద్యం షాపులు నిర్వ‌హిస్తోంది.

లాభాపేక్ష లేకుండా మ‌ద్యం షాపులు నిర్వ‌హిస్తున్నాం. మ‌ద్యాన్ని నియంత్రిస్తూ అక్క చెల్ల‌మ్మ‌ల‌కు తోడుగా ఉండే ప్ర‌య‌త్నం ఈ ప్ర‌భుత్వం చేస్తుంద‌ని గ‌ర్వంగా చెబుతున్నాం. ఈ ప‌థ‌కాల‌తో మ‌హిళా సాధికార‌త‌కు అడుగులు ప‌డాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నా..మ‌హిళా స్వేచ్ఛ‌కు, వారి నిర్ణ‌యాధికారానికి, వారు ఎద‌గ‌డానికి ఈ ప‌థ‌కాలు ఉప‌యోగ‌ప‌డాల‌ని ఈ ప‌థ‌కాల‌కు శ్రీ‌కారం చుట్టాం. 21వ శ‌తాబ్ధంలో ఆధునిక భార‌త మ‌హిళ ఏపీలోని ప్ర‌తి గ్రామంలో, ప్ర‌తి ఇంటి  క‌నిపించాల‌ని మ‌న‌స్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా..ఇవాళ మ‌హిళ‌ల‌కు పేరుకు ఒక‌టో రెండు ప‌థ‌కాలు పెట్ట‌డ‌మే కాకుండా, మ‌హిళ‌ల పిల్ల‌ల చ‌దువుల కోసం, వారి సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితులు మార్చేందుకు, కుటుంబంలో, స‌మాజంలో స‌మానంగా అవ‌కాశాలు, అధికారాలు ద‌క్కే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటూ మ‌హిళా ప‌క్ష‌పాత ప్ర‌భుత్వంగా ఉంటుంద‌ని స‌గ‌ర్వంగా చెబుతున్నా. మూడు కోట్ల అక్క చెల్లెమ్మ‌ల‌కు మంచి చేసే కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప‌గా కార్య‌క్ర‌మాలు చేప‌డుతామ‌ని, ఆశీర్వ‌దించాల‌ని, మీ బిడ్డ‌గా, మీ అన్న‌గా , త‌మ్ముడిగా ఇంకాగొప్ప‌గా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేలా ఆశీర్వ‌దించాల‌ని కోరుతూ సెల‌వు తీసుకుంటున్నా..అంటూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న ప్ర‌సంగాన్ని ముగించి..మ‌హిళ‌ల‌తో మాట్లాడారు.

Back to Top