వెల్‌డ‌న్‌..వెల్‌డ‌న్‌

స‌చివాల‌య ఉద్యోగుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

చప్పట్లు కొట్టిన‌ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌

రాష్ట్ర‌వ్యాప్తంగా అభినంద‌న‌ల వెల్లువ 

తాడేప‌ల్లి: గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తయిన సందర్భంగా  గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి సీఎం వైయ‌స్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం 7 గంట‌ల స‌మ‌యంలో క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చ‌ప్ప‌ట్లు కొట్టి స‌చివాల‌య ఉద్యోగులు, వాలంటీర్ల‌ను అభినందించారు. వెల్‌డ‌న్‌..వెల్‌డ‌న్ అంటూ ప్రోత్స‌హించారు. అలాగే రాష్ట్ర‌వ్యాప్తంగా వాడ‌వాడ‌లా ప్ర‌జ‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు స‌చివాల‌య సిబ్బందిని చ‌ప్ప‌ట్లు కొట్టి అభినందించారు.  మన గ్రామాల్లో మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయం కావాలన్నాకూడా వివక్ష లేకుండా, లంచాలకు తావులేకుండా మనకు మంచి చేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలు స్థాపించి దాదాపు ఏడాది పూర్తవుతోంది. ఏడాది పూర్తవుతున్న సందర్భంగా గ్రామ స్వరాజ్యం మన అందరికీ కూడా కళ్ల ఎదుటే కనిపించే విధంగా వీళ్లందరూ కూడా మనకు సేవలు అందిస్తున్నారు. లాభాపేక్ష లేకుండా మనకు సేవలు చేస్తున్నారు. దీంతో సాయంత్రం 7 గంటలకు మనకు మంచి సేవలు అందిస్తున్న వీరందరినీ అభినందిస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చి చప్పట్టు కొట్టి అభినందించారు.  గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, వాలంటీర్లను ప్రోత్సహించేలా, వారికి తోడుగా ఉండేలా నిలిచేందుకు వారిని చప్పట్లతో అభినందించాలన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పిలుపున‌కు రాష్ట్ర‌వ్యాప్తంగా స్పంద‌న ల‌భించింది.  ప్ర‌జ‌లంతా సాయంత్రం 7 గంటలకు బయటకు వచ్చి చప్పట్లు కొట్టి అభినందించ‌డంతో స‌చివాల‌య సిబ్బంది, వాలంటీర్లు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

 

Back to Top