క్వారంటైన్‌ నుంచి ఇళ్లకు వెళ్లే పేదలకు రూ.2 వేల సాయం

కరోనా నియంత్రణ సమీక్షలో అధికారులకు సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశం

రైతును ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి

సర్వేలో గుర్తించిన 32 వేల మందికి వైద్య పరీక్షలు చేయండి

తాడేపల్లి: కుటుంబ సర్వే ద్వారా గుర్తించిన సుమారు 32 వేల మందికి కూడా వైద్య పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రులు, అధికారులను ఆదేశించారు. మండలాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ర్యాండమ్‌గా వైద్య పరీక్షలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలపై, కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్రంలో తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు బొత్స సత్యనారాయణ, మోపిదేవి వెంకట రమణ, కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

కుటుంబ సర్వే ద్వారా వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు గుర్తించిన సుమారు 32 వేల మంది వైద్య పరీక్షలు చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన తరువాత ఇళ్లకు వెళ్లేవారిలో పేదలకు రూ. 2 వేల ఆర్థికసాయం అందించాలని సీఎం ఆదేశించారు. క్వారంటైన్‌ నుంచి ఇళ్లకు వెళ్లినవారు ప్రతివారం పరీక్షలు చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 

అదే విధంగా పుచ్చకాయ, అరటి ఉత్పత్తుల మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశించారు. వంట నూనెల ధరలపైనా దృష్టిపెట్టాలన్నారు. రైతులను ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలన్నారు. 
 

Back to Top