డైవర్షన్‌ పాలిటిక్స్ ఎల్ల‌కాలం చెల్లవు చంద్రబాబూ..!

రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది

మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం

వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌

తాడేప‌ల్లి:  డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ ఎల్ల‌కాలం చెల్ల‌వంటూ వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చంద్ర‌బాబును హెచ్చ‌రించారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న అరాచ‌కాలు, రెడ్‌బుక్ రాజ్యాంగం అమ‌లు, జ‌ర్న‌లిస్ట్ కొమ్మినేని అరెస్టు, సాక్షి కార్యాల‌యాల‌పై పచ్చ‌మూక‌ల దాడిని ఖండిస్తూ వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాత‌లో పోస్టు చేశారు.

ఎక్స్ వేదిక‌గా వైయ‌స్ జ‌గ‌న్‌..

చంద్ర‌బాబు గారూ.. అనని మాటలను సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారికి ఆపాదిస్తూ, వాటిని వక్రీకరించి విషప్రచారం చేసి, ఆయన్ను అరెస్టు చేయడమే కాకుండా సాక్షి యూనిట్‌ ఆఫీసులమీద ఒక పథకం ప్రకారం దాడులు చేయించారు. ఈ అరాచకానికి మహిళల గౌరవం అనే ముసుగు తొడిగి ఎక్కడికక్కడ విధ్వంసం చేస్తూ ఆటవికంగా వ్యవహరిస్తున్నారు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా? అని మీరు, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అని మీ బావమరిదిగారు గతంలో అన్న మాటలు చూస్తే.. మీకు మహిళల మీద ఎంతటి గౌరవం ఉందో తెలుస్తుంది. 

చంద్రబాబు గారూ.. రాష్ట్రంలో మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయింది. ఈ  ఏడాది పాలనలో మహిళలు, బాలికల పట్ల మీకు ఎలాంటి చిత్తశుద్ధిలేదని తేలిపోయింది. అనంతపురంలో ఇంటర్మీడియట్‌ చదువుకునే తమ కూతురు తన్మయి కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తే, 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి దారుణంగా హత్యకు గురై శవమై కనిపించింది. కనిపెట్టడానికి మీకు, మీ యంత్రాంగానికి చేతకాలేదు. శ్రీ సత్యసాయి జిల్లా, రామగిరి మండలం, ఏడుకుర్రాకులపల్లెలో 9వ తరగతి విద్యార్థినిపై  6 నెలలుగా బ్లాక్‌మెయిల్‌ చేసి 14 మంది అత్యాచారం చేస్తే, బాధితురాలు ఫిర్యాదు చేయనీయకుండా భయపెట్టారు, నేరం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం మీకు చేతకాలేదు. కొందరు చేస్తున్న అఘాయిత్యాలకు  స్కూలుకు వెళ్తున్న బాలికలు గర్భం దాలుస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. మీ పాలన మొదటి ఏడాదిలోనే 188 మంది మహిళలు, బాలికలు అత్యాచారాలకు గురైతే, 15 మందిని రేప్‌ చేసి చంపేశారు. వందలకొద్దీ మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, వేదింపులకు పాల్పడ్డారు. మీ ట్రాక్‌ రికార్డు ఇంత ఘోరంగా ఉంది. 

చంద్రబాబు గారూ.. మీరు వచ్చాక విద్య, వైద్యం, వ్యవసాయం, లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా నాశనం అయిపోయాయి, నిర్వీర్యం అయిపోయాయి. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. అధికారంకోసం సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌ పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి, తీరా సీట్లోకి వచ్చాక వారికి నిలువెల్లా వెన్నుపోటు పొడిచి, ఏడాది పాలన తర్వాత ప్రజలముందు దోషిగా నిలబడ్డారు. పాలనలో చతికిలపడ్డ, అసమర్థ, అవినీతి, అరాచక ముఖ్యమంత్రిగా ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు. వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి మీ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలతో తప్పుడు ప్రచారం చేయించి, కిరాతకంగా వ్యవహరిస్తున్నారు. డైవర్షన్‌ పాలిటిక్స్ ఎంతకాలం చెల్లవు చంద్రబాబు గారూ

Back to Top