విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వ 'ప్రసాద్' స్కీం కింద నిధులు కేటాయించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు లేఖ రాశారు. ఈ సందర్భంగా మంత్రి.. విశాఖ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం అభివృద్ధికి, మౌలికసదుపాయాల కల్పనకు ప్రసాద్ పథకం లో మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈక్రమంలో రాష్ట్రంలోని తొమ్మిది ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించాలని కోరుతూ కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని మంత్రి పేర్కొన్నారు. 2015, 2017 సంవత్సరాలలో 'ప్రసాద్' పథకంలో భాగంగా అమరావతి, శ్రీశైలం దేవస్థానాలకు 2 ప్రాజెక్టులు మంజూరు అయ్యాయని, అవి పూర్తయ్యాయని మంత్రి పేర్కొన్నారు. *అయితే..గత 4ఏళ్లుగా 'ప్రసాద్' స్కీంలో భాగంగా రాష్ట్రానికి ఎటువంటి పనులు కేటాయించలేదని మంత్రి తెలిపారు. టెంపుల్ టూరిజంను ప్రోత్సహిస్తూ.. ఏపీలోని పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, భక్తుల సౌకర్యార్థం రాష్ట్రానికి విరివిగా నిధులు కేటాయించాలని ఈసంధర్బంగా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కేంద్ర టూరిజం శాఖ మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు.* ఆ తొమ్మిది ప్రాజెక్టులివే.. ప్రాజెక్టు వివరాలు ఖర్చు 1) సింహాచలం.. వరాహలక్ష్మీ నరసింహా వారి దేవస్థానం రూ.53.69 కోట్లు 2) ద్వారకాతిరుమల.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రూ. 83.33 కోట్లు 3) శ్రీకాకుళం.. శ్రీముఖలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రూ.55.00 కోట్లు 4) అన్నవరం.. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం రూ.48.58 కోట్లు 5) విజయవాడ.. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం రూ.74.86 కోట్లు 6) తిరుపతి.. రూ.67.88 కోట్లు 7) పుట్టపర్తి.. రూ.753.00 కోట్లు 8) వేదగిరి.. శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి దేవస్థానం రూ. 49.00 కోట్లు 9) మోటుపల్.. టూరిజం, మౌలికసదుపాయాలు రూ.48.58 కోట్లు