వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ జిల్లాలో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలపై వరుసగా దాడులు జరుగుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలోనే సింహాద్రిపురం మండలం పైడిపాలెం రిజర్వాయర్ గెస్ట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన వైయస్ఆర్ విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో అంతకుముందు జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి గ్రామంలోనూ వైయస్ఆర్ విగ్రహం ధ్వంసం కావడం కలకలం రేపింది. వరుసగా మహానేత విగ్రహాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరగడం వెనుక కావాలనే ఉద్రిక్తతలు రెచ్చగొట్టే కుట్ర ఉందని వైయస్ఆర్సీపీ శ్రేణులు ఆరోపించాయి. పైడిపాలెం ఘటనపై వైయస్ఆర్సీపీ నాయకులు సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన బాధ్యులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు డిమాండ్ చేశారు.