రివర్స్‌టెండరింగ్‌ సక్సెస్‌

రూ. వెయ్యి కోట్ల ప్రజాధనం ప్రభుత్వానికి ఆదా చేశాం

తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనుల్లో రూ.61 కోట్లపైగా మిగులు

వందల కోట్లు ఆదా చేస్తే దోపిడీ అంటారా..?

‘రిత్విక్‌’ కూడా లెస్‌లో పాల్గొంది.. ఇది కాదా పారదర్శకత

ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు వేల కోట్లు దోచుకున్నారు

ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌కుమార్‌యాదవ్‌

తాడేపల్లి: రివర్స్‌టెండరింగ్‌ విధానంలో సక్సెస్‌ అవుతున్నామని, దాదాపు రూ. వెయ్యి కోట్ల ప్రజాధనాన్ని ఆదా చేశామని ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. రివర్స్‌టెండరింగ్‌ విధానంతో వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తే దాన్ని దోపిడీ అంటారా.. చంద్రబాబూ అని ప్రశ్నించారు. జలయజ్ఞంలో భాగంగా దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ రివర్స్‌టెండరింగ్‌కు తీసుకెళ్లి రూ. 61 కోట్లకుపైగా ప్రభుత్వానికి మిగిల్చామన్నారు. రివర్స్‌టెండరింగ్‌ విధానంతో నాలుగు నెలల్లో ఇరిగేషన్‌ డిపార్టుమెంట్‌ ద్వారా దాదాపు రూ. వెయ్యి కోట్లు ఆదా చేశామని మంత్రి అనిల్‌ చెప్పారు. దీనిపై ప్రతిపక్షం అనవసరపు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ ధనం ఆదా చేస్తుంటే హర్షించాల్సిందిపోయి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు దక్కించుకునేందుకు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, గతంలో టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యుడికి చెందిన రిత్విక్‌ కంపెనీ కూడా లెస్‌కు పాల్గొందన్నారు. పారదర్శక పాలనకు ఇంతకంటే నిదర్శనం అవసరం లేదన్నారు.

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసే రోజే రూ. వంద కోట్లు దాటిన ప్రతి పనిని రివర్స్‌టెండరింగ్‌ విధానం ద్వారా జ్యూడీషియల్‌ సిస్టమ్‌ ముందుకు తీసుకెళ్తామని చెప్పారన్నారు. చెప్పిన మాట ప్రకారం రివర్స్‌టెండరింగ్‌ ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. వెయ్యి కోట్లు ఆదా చేశామన్నారు. తాజాగా వెలిగొండ ప్రాజెక్టు పనులు రూ.540 కోట్లకు సంబంధించి రివర్స్‌టెండరింగ్‌కు వెళ్లామని, దీంతో ప్రభుత్వానికి రూ. 61 కోట్లకుపైగా ఆదా అయ్యిందన్నారు. ఇంకా నెల రోజుల్లో ఇరిగేషన్‌ శాఖ ద్వారా రూ.15 వందల కోట్లు ఆదా చేయబోతున్నామని చెప్పారు.

వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వ పనితీరును ఓర్వలేక చంద్రబాబు, ఆయన తాబేదారులు ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అనిల్‌ మండిపడ్డారు. ప్రభుత్వం పనులన్నీ ఆపేసిందని మాట్లాడుతున్నారని మాట్లాడుతున్నారు.. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల పాటు ప్రాజెక్టుల పనులు చేపట్టిన దాఖలాలు లేవన్నారు. పోలవరం పనులు కూడా రెండున్నరేళ్ల తరువాత మొదలుపెట్టారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల పాలనలోనే అన్ని ప్రాజెక్టులను రివ్యూ చేసి పనులు ప్రారంభిస్తున్నారన్నారు. వేల కోట్ల రూపాయల పనులు చేశామని చంద్రబాబు, ఆయన తాబేదారులు చెబుతున్నారని, ఆ పనులను రివర్స్‌టెండరింగ్‌కు తీసుకెళ్లి ఉంటే వేల కోట్ల రూపాయల ప్రజాధనం మిగిలి ఉండేదన్నారు. ఎంతసేపు ప్రాజెక్టుల అంచనాలు పెంచి పెద్దబాబు, చిన్నబాబు వాటాలు పంచుకోవడమే సరిపోయిందన్నారు.

పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారని మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండేవారని, ఇప్పుడు ఆయన తనయుడు, మనసున్న మహరాజు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రాజెక్టులకు జలకళ వచ్చిందని, అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. దీన్ని కూడా చంద్రబాబు ఆయన కోటరీ ఓర్వలేకపోతున్నారంటే ఇక వారిని ఆ భగవంతుడే కాపాడాలన్నారు. చంద్రబాబు చేసిన బండాలరన్నీ ఒకొక్కటిగా బయటపడుతున్నాయన్నారు.

మున్సిపాలిటీల్లో హౌసింగ్, అనేక ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇవన్నీ లెక్కకు తీసుకున్నా రివర్స్‌టెండరింగ్‌ ద్వారా రూ.5 వేల కోట్ల ఆదా చేయబోతున్నామని మంత్రి అనిల్‌ అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని రూ.2.50 లక్షల కోట్ల అప్పులో ముంచి వెళ్లాడన్నారు. రివర్స్‌టెండరింగ్‌లో కోల్‌ ట్రాన్స్‌పోర్టులో కూడా రూ.25 కోట్లు ఆదా చేశామని చెప్పారు. ఆదా అయిన సొమ్మును ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తామని, సీఎం వైయస్‌ జగన్‌ కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నింపుతున్నారన్నారు.

Read Also: పోలీసులు త్యాగానికి నిలువుటద్దం

Back to Top