న్యూఢిల్లీ: అనకాపల్లి జిల్లా పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్సార్ సీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసారు. పంచదార్లను శాశ్వత నో మైనింగ్ జోన్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేయకుంటే పార్లమెంట్ లో ఈ అక్రమ తవ్వకాలు, సహజ వనరుల దోపిడీపై పార్లమెంట్ కు చర్చకు లేవనెత్తుతామని నేతలు ప్రకటించారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ తనూజా రాణి, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాధ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డేటి ప్రసాద్ లు కలసి కేంద్ర మంత్రులకు పంచదార్ల అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసారు. అనంతరం ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ నేతలు మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, పవిత్రమైన ఐదు జలధారలకు మైనింగ్ కార్యకలాపాలతో ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. పంచదారల కొండను తక్షణమే ‘నో మైనింగ్ జోన్’గా ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అక్రమ మైనింగ్ పై పార్లమెంట్ లో లేవనెత్తుతాం : ఎంపీ గొల్ల బాబూరావు కూటమి ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కుమ్మక్కై పంచదారలతో పాటుగా అనేక సహజ సిద్ధమైన వనురలను దోచుకుంటున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ బరితెగించి వ్యవహరిస్తున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇకపై దోపిడీని సాగనివ్వం. పంచదార్ల మాత్రమే కాదు ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనేక ఆలయాల పరిధిలోను, కొండలను ధ్వంసం చేస్తూ కూటమి నేతలు వనరులను దోపిడీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజలకు అన్యాయం చేసేలా వ్యవహరిస్తున్న కూటమి నేతలకు బుద్ధి చెప్పేలా మైనింగ్ అక్రమాలపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేస్తాం. పురాతనమైన ఆలయాలను, కట్టడాలను, చారిత్రక సంపదను కాపాడాలన్న అధినేత జగన్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పాలకుల అరాచకాలకు అడ్డుకట్ట వేస్తాం. ఈ అడ్డగోలు వ్యవహారం వైఎస్సార్ సీపీ తొలి నుంచి సంబంధిత శాఖల అధికారులకు ఫిర్యాదులు చేసినా అధికార పార్టీ నేతల ఒత్తిడి కారణంగా ఎటుంటి చర్యలు తీసుకోలేదు. పంచదార్ల వంటి పవిత్ర పుణ్యక్షేత్రంపై ప్రభుత్వ ఉదాసీనతను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం. 10 రోజుల్లో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు : అరకు ఎంపీ తనూజా రాణి పంచదార్లలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వెనుక సూత్రధారి అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్. తన రాజకీయ అధికారంతో అనుచరుల పేరిట మైనింగ్ లీజులు తీసుకుని అక్రమ తవ్వకాలు చేస్తూ అడ్డగోలుగా దోపిడీ సాగిస్తున్నారు. మార్చి 2న మైనింగ్ ప్లాన్కు దరఖాస్తు చేయగా, నెల రోజుల్లోనే పర్యావరణ అనుమతులు వచ్చాయని, మేలో లీజ్ మంజూరైందని చెప్పారు. మైనింగ్ కార్యకలాపాలపై ఫిర్యాదులు, ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో పంచదారల జలధారల్లో బురద నీరు రావడం ప్రారంభమైంది. ఈ వ్యవహారంపై గత ఏడాది స్థానికులు, సర్పంచ్ అక్రమ మైనింగ్పై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోలేదు. అధికారుల సంయుక్త తనిఖీలో మైనింగ్ కార్యకలాపాలు, బ్లాస్టింగ్ వల్ల వచ్చే వైబ్రేషన్ల కారణంగా జలధారలపై ప్రభావం పడుతున్నట్లు గుర్తించారు. బురద నీరు రావడానికి మైనింగ్ కార్యకలాపాలే కారణమని ప్రాథమికంగా నిర్ధారించడంతో నిలిపివేత ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం జరిగిన విచారణలో అనుమతించిన మైనింగ్ ప్లాన్కు మించి సుమారు రెండు లక్షల టన్నుల గ్రావెల్ అక్రమంగా తవ్వినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు. లీజుదారునిపై నిబంధనల ప్రకారం భారీ జరిమానా విధించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదు. సీఎం రమేశ్ అనకాపల్లిలో సాగిస్తున్న అడ్డగోలు వ్యవహారంపై కేంద్ర మైన్స్ మంత్రి కిషన్రెడ్డి, కేంద్ర పర్యాటక–సంస్కృతి, పురావస్తు శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి పంచదారల పరిస్థితిని వివరించాం. సమస్యపై కేంద్ర బృందాన్ని పంపించి పరిశీలన జరిపిస్తామని, 10 రోజుల్లో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. ఎంపీ సీఎం రమేశ్ పాత్రపై సీబీఐ విచారణ చేయాలి : మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పంచదార్లలో మైనింగ్ ప్లాన్కు విరుద్ధంగా సుమారు రెండు లక్షల టన్నుల గ్రావెల్ తవ్వకాలు జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. అక్రమ మైనింగ్కు నిబంధనల ప్రకారం సుమారు రూ.250 కోట్ల జరిమానా విధించాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆ స్థాయిలో చర్యలు తీసుకోలేదు. మైనింగ్ వ్యవహారంపై అధికారుల సంయుక్త తనిఖీ అనంతరం స్టాపేజ్ ఆర్డర్ జారీ చేసినా ఖాతరు చేయలేదు. అక్రమ మైనింగ్కు సంబంధించి ఎంఆర్ఓ, వీఆర్ఓ, ఏడి మైన్స్ స్థాయి అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకోవడం సరికాదు అక్రమ తవ్వకాలపై ముందుగానే ఫిర్యాదులు అందిన నేపథ్యంలో బాధ్యత వహించాల్సిన ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలి. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ పాత్రపై దర్యాప్తు చేయాలి. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి పేరుతో క్వారీ లీజ్ పొందారు. తవ్విన మట్టిని వివిధ ప్రాజెక్టుల ఫిల్లింగ్కు తరలిస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి, వాస్తవాలను వెలుగులోకి తేవాలి. అక్రమ మైనింగ్ కు బాధ్యత వహిస్తూ సీఎం రమేష్ రాజీనామా చేయాలి. ప్రభుత్వం జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలి. శాశ్వత జీవో జారీ చేసే వరకు పోరాటం :మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పంచదారల కొండను తక్షణమే నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయాలి ఒక్క పంచదారలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని పవిత్ర ఆలయాలు, చారిత్రక, పురావస్తు ప్రాధాన్యత కలిగిన కొండ ప్రాంతాల్లో మైనింగ్, కొత్త కేటాయింపులను నిషేధించాలి . ప్రభుత్వం స్పందించకపోతే ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతాం. ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ సహజ సంపదను దోచుకుపోతాం అంటే చూస్తే ఊరుకునేది లేదు. ఎన్నికలకు ముందు డబ్బు సంచులతో వచ్చి వెదజల్లి.. ఇక్కడ వనరలను దోచుకోని కోట్లాది రూపాయల సొమ్ము చేసుకుని మళ్లీ ఎన్నికల్లో వెదజల్లే సీఎం వ్యవహారాన్ని ఇక సాగనివ్వం. వెన్నుపోటు పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన కోవర్టు సీఎం రమేశ్. సీఎం చంద్రబాబు నాయుడు అండతో ఇలాంటి అరాచకాలకు, అడ్డగోలు వ్యవహారాలకు సీఎం రమేశ్ పాల్పడుతుంటే, అనకాపల్లి జిల్లా ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోరు. చర్యలు లేకుంటే వైఎస్సార్ సీపీ ఉద్యమం ఉధృతం : అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేటి ప్రసాద్ పంచదార్ల అక్రమ మైనింగ్ వ్యవహారంపై తొలి నుంచి వైఎస్సార్ సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. తొలుత ధర్నాలు, నిరసనలు చేపట్టి ప్రజలు దృష్టికి తీసుకువచ్చాం. తర్వాత జిల్లా కలెక్టర్ తో పాటుగా అధికారులకు ఫిర్యాదు చేసాం. అయినా సరే ఎంపీ సీఎం రమేశ్ ఒత్తిడి కారణంగా యధేచ్ఛగా దోపిడీని సాగించారు. దీనిపై వైఎస్సార్ సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, ఛలో పంచదార్ల పేరిట కార్యక్రమాలు చేపట్టడంతో కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టింది. తాత్కాలికంగా పంచదార్లలో అక్రమ మైనింగ్ ని నిలిపివేసారు. నో మైనింగ్ జోన్ గా కూడా వైఎస్సార్ సీపీ అందోళన ధాటికి ప్రభుత్వం దిగివచ్చి ప్రకటన చేసింది. కానీ శాశ్వత నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలన్నది మా డిమాండ్. ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటన చేసే వరకు మా పోరాటం ఆగదు. పంచదార్ల గ్రామం నుంచి మొదలైన అక్రమ మైనింగ్ పై పోరాటం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి వరకు చేరింది. ప్రజల డిమాండ్ మేరకు ప్రభుత్వం శాశ్వత నో మైనింగ్ జోన్ ప్రకటించ వరకు వైఎస్సార్ సీపీ వెనక్కి తగ్గబోదు. ఎంపీ సీఎం రమేశ్ పై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆపదు.