హైదరాబాద్ : ప్రభత్వ కార్యాలయాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల గుర్తు అయిన సీలింగ్ ఫ్యాన్ తొలిగించాలని తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేసిన ఘటనపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఫ్యాన్ గుర్తు చంద్రబాబుకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఫ్యాన్లు తొలగించాలట. ఇంకా యుద్ధమే ఆరంభం కాలేదు. అప్పుడే చెమటలు కారుతున్నాయి. కాసేపు ఫ్యాన్ వేసుకోండి చల్లబడతారు. పోలింగు నాటికి ఇళ్లలోని ఫ్యాన్లను కూడా బలవంతంగా ఎత్తుకెళ్లేట్టున్నారు’ అని ఎద్దేవా చేశారు.
దీనికే మురిసిపోతే ఎలా బాబు?
గాలి విసిరి కొట్టినప్పుడు తాలు గింజలు కొట్టుకొస్తాయని, దీనికే ఇంత మురిసి పోతే ఎలా చంద్రబాబు.. అవి తినడానికి పనికిరావని, నాటితే మొలకెత్తవని, అర్థం చేసుకోలేనంత అమాయకుడవేం కాదనుకో.. అని టీడీపీ చేరికలపై సెటైరిక్గా ట్వీట్ చేశారు. కానివ్వు.. ఫొటోలకు ఫోజులిచ్చుకో.. పచ్చ మీడియా ఉన్నదిగా లేనిది చూపియ్యడానికని విమర్శించారు. అప్పుడే ఇలా అయితే ఎలా.. ఇంకా 28 రోజుల పాటు చొక్కాలు చింపుకోవాలి.. కొన్ని శాపనార్థాలు దాచుకో చంద్రబాబు.. 9 ఏళ్లుగా వైయస్ జగన్పై దుమ్మెత్తి పోస్తూనే ఉన్నావుగా... అయినా కసి తీరడం లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, విశ్వసనీయత, నిజాయితీ తెలియని వ్యక్తులు అందరినీ దోషులుగా చూపడం కొత్తేమీ కాదులేనని పేర్కొన్నారు.