తాడేపల్లి: రాజధానికి భూములివ్వలేదనే అక్కసుతో కాపాడాల్సిన ప్రభుత్వమే, రైతులపై గూండాగిరీ చేసి వారి పొలాలను జేసీబీలతో సర్వనాశనం చేసిందని మంగళగిరి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ ఇన్చార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా 11 మంది రైతులు తమకున్న కొద్దిపాటి భూమిని ఇవ్వడానికి నిరాకరిస్తే, ప్రభుత్వం వారితో మాట్లాడి ఒప్పించాల్సిందిపోయి దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాజధాని ప్రకటించక మునుపే ఉండవల్లిలో ఎకరం రూ. 5 నుంచి 6 కోట్లు పలికితే, ఇప్పుడు రూ. 2.40 కోట్లు ధర నిర్ణయించిందని వివరించారు. దానికి ఒప్పుకోలేదనే కారణంతో 10 నుంచి 30 సెంట్లు ఉన్న 11 మంది రైతుల పొలాలను వంద మంది పోలీసు బలగాలను మోహరించి బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. శని, ఆదివారాలైతే కోర్టులు కూడా ఉండవని, రైతులు ఎక్కడికీ వెళ్లలేరనే కుట్రతోనే ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందని వేమారెడ్డి ఆరోపించారు. తప్పుడు ప్రకటనలతో అమరావతి రైతులను చంద్రబాబు భ్రమల్లో ముంచుతున్నాడని, రాజధానికి భూములిచ్చి పదేళ్లయినా ఇప్పటికీ ఏ ఒక్క రైతుకీ డెవలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుకి భూదాహం ఎక్కువైందని, నష్టపోయిన రైతుల పక్షాన నిలబడి వైయస్ఆర్సీపీ పోరాడుతుందని దొంతిరెడ్డి వేమారెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... చంద్రబాబు కూటమి పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోంది. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది. రైతుల పక్షాన నిలవాల్సిన ప్రభుత్వమే పచ్చని పొలాల మీద పడి దాదాగిరీ చేస్తూ పంటలను నాశనం చేస్తోంది. చంద్రబాబుకి భూదాహం ఎక్కువైంది. రాజధానికి భూములు ఇవ్వలేదన్న అక్కసుతో వేధింపులకు గురిచేస్తున్నారు. ఒకపక్క పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అల్లాడుతుంటే అమరావతిలో మాత్రం వ్యవసాయం చేయడానికి వీల్లేకుండా ప్రభుత్వం పొలాలను లాగేసుకోవడమే పనిగా పెట్టుకుంది. - 11 మంది రైతులకు న్యాయం చేయలేరా? రాజధాని నిర్మాణం పేరుతో ఉండవల్లి, పెనుమాక గ్రామాల్లో పంటలను సర్వ నాశనం చేస్తున్నారు. భారీగా మోహరించిన పోలీసుల సమక్షంలో అధికారులు జేసీబీలతో పంటలను పూర్తిగా దున్నేశారు. ఉండవల్లిలో 11 మంది చిన్న, సన్నకారు రైతులు రాజధానికి భూమి ఇవ్వడం ఇష్టంలేక వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికీ 10 నుంచి 30 సెంట్లు మాత్రమే భూమి ఉంది. దాని మీదనే వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. మొత్తం 2.72 ఎకరాల భూమి కోసం ప్రభుత్వం గూండాగిరీ చేసింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకి అడ్డంగా ఉందనే కారణంతో పంటలు వేసి ఉన్న ఆ పొలాలను జేసీబీలతో నాశనం చేసి మరీ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తీసుకోవాల్సిన ప్రభుత్వం దౌర్జన్యం చేసింది. భూములివ్వని రైతు కుటుంబాల స్థితిగతులు, ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యంగా భూములు లాగేసుకోవడం దుర్మార్గం. 10 నుంచి 20 సెంట్లు భూమి ఉన్న రైతు విషయంలో ప్రభుత్వం ఇంత నిర్దయగా వ్యవహరించడం సిగ్గుచేటు. శని, ఆదివారాలు కోర్టులు కూడా ఉండవని, రైతులు ఎవరికీ చెప్పుకోలేరనే కుట్రతో శనివారం ఉదయం అధికారులు వారి భూముల్లోకి గూండాల్లాగా చొరబడి పంటలను నాశనం చేశారు. లక్షల కోట్లు అప్పులు చేస్తున్న ప్రభుత్వం, 2,72 ఎకరాల భూములకు నష్టపరిహారం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు. ఉండవల్లిలో ఉన్న మార్కెట్ ధర ప్రకారం రైతులకు నష్టపరిహారం చెల్లించలేకపోతోందా? రాజధాని ప్రస్తావనే లేని కాలంలోనే ఉండవల్లిలో ఎకరం రూ.5 కోట్లు పలికితే, ఇప్పుడు అధికారులు రూ. 2.40 లక్షలు నిర్ణయించడం దారుణం. కూటమి ప్రభుత్వం రైతులకు తీరని ద్రోహం చేస్తోంది. రైతులను భ్రమల్లో ముంచుతోంది. రాజధానికి భూములిచ్చిన రైతులకు తక్షణం డెవలప్ చేసిన ప్లాట్లు కేటాయించాలి. రైతులను వేధిస్తున్న ప్రభుత్వం మూల్యం చెల్లించుకోకతప్పదు. కూటమి ప్రభుత్వం కారణంగా అన్యాయానికి గురవుతున్న ప్రతి రైతుకీ వైయస్ఆర్సీపీ అండగా నిలబడి పోరాడుతుంది. రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం తగదని దొంతిరెడ్డి వేమారెడ్డి అన్నారు.