ఇది వైయస్‌ జగన్ జన సునామీ

హైదరాబాద్ :

ఒక చోట కాదు... ఒక జిల్లా అని లేదు... ఎక్కడ చూసినా అభిమాన జనసంద్రమే. సూర్యుడు చండ్ర నిప్పులు చెరుగుతున్న ఎండల్లో సైతం వెల్లువలా పోటెత్తుతున్న జనాభిమాన కోలాహలమే! ‌వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ఒక ఊరి నుంచి మరో ఊరికి రోడ్డు మార్గంలోనే వెళుతున్నారు. దారి పొడవునా ఎదురుచూస్తున్న జనసందోహానికి ఆయన నమస్కరిస్తూ... వారి కోరిక మేరకు వాహనం దిగి పలకరిస్తూ... వారి సమస్యలు వింటూ... ఓదారుస్తూ ఎన్నికల ప్రచారంలో మునుముందుకు ఉత్సాహంగా సాగుతున్నారు. ఆయన మరో ఊరు చేరేసరికి భగభగ మండుతున్న ఎండల్లో సైతం వేలాది మంది అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. రోడ్‌షోలు, బహిరంగ సభల్లో శ్రీ జగన్ చెప్పే ప్రతి మాటకీ‌ జనం స్పందిస్తున్నారు. ప్రత్యర్థుల కుయత్నాలపై పిడికిళ్లు బిగిస్తున్నారు, రాజన్న రాజ్యానికి చెయ్యెత్తి జైకొడుతున్నారు.

ఇదంతా పూర్తయి మరో ఊరు చేరేసరికి... అక్కడా జన ప్రవాహం పోటెత్తుతోంది. శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డితో పాటు ప్రచారం చేస్తున్న ఆయన సోదరి శ్రీమతి షర్మిల, దివంగత మహానేత డాక్టర్ వై‌యస్ఆర్ సతీమణి, విశాఖ ‌లోక్‌సభా నియోజకవర్గం పార్టీ అభ్యర్థి శ్రీమతి వైయస్ విజయమ్మ సభల‌లోనూ జనం వెల్లువెత్తుతున్నారు. పోనీ వాళ్లను ఎవరైనా తీసుకొస్తున్నారా? రమ్మని పిలుస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. జననేతను చూడటానికి, అభిమానం చూపించటానికి స్వచ్ఛందంగా బయటికొస్తున్నారు.
నిజానికి శ్రీ జగనేమీ తొలిసారి జనం ముందుకు వస్తున్న నాయకుడు కాదు. నాలుగేళ్లుగా ఓదార్పు యాత్రతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలోని ప్రతి పల్లెనూ పలకరించిన జన నాయకుడే. అయినా సరే! తమ ఇంట్లో మనిషి కోసం తరలి వస్తున్నట్టుగా, తమ సొంత సోదరుడినో, బిడ్డనో చూడటానికి వస్తున్నట్టుగా జనం తండోపతండాలుగా వస్తున్నారు.

ఈ తీనును గమనిస్తున్న రాజకీయ నిపుణులు... ఇది 1978 నాటి ఇందిర ప్రభంజనాన్ని, 1983, 1994 నాటి ఎన్టీఆర్ సునామీని గుర్తుకు తెస్తోందంటున్నారు. ‘ఇవేవో వారానికోసారో, పది రోజులకోసారో నిర్వహిస్తున్న సభలు కావు. వై‌యస్ఆర్ కుటుంబ‌ సభ్యులు ముగ్గురూ సగటున రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది సభలు నిర్వహిస్తున్నారు. ఇక రోడ్‌షోలకు లెక్కేలేదు. జనం రోడ్‌షోలకు భారీగా తరలి వస్తూనే... సభలకైతే వెల్లువెత్తుతున్నారు. ఇది రాష్ట్రంలో ఇంతకు ముందు ఎన్నికల్లో కనిపించిన ఏ ప్రభంజనానికీ తీసిపోదనే చెప్పాలి. ఈ సారి సీమాంధ్రలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి గాలి మామూలుగా ఉండదు’ అని వారు వివరిస్తున్నారు.

గుంటూరు జిల్లాలో గత కొద్ది రోజులుగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా శ్రీ జగన్ సభలకు వచ్చేసరికి అంతటి ఎండలు కూడా వెలవెల పోతున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సైతం వృద్ధులు, మహిళలు శ్రీ జగన్‌ కోసం భారీ ఎత్తున నిరీక్షించారు. యువకులు మిద్దెలు, మేడలు, సెల్ టవర్లు ఎక్కి జగనన్నకు జేజేలు పలికారు. 42 డిగ్రీల ఎండలో కూడా రోడ్డుకు ఇరువైపులా బారులు తీరి... జననేతపై పూలవర్షం కురిపించారు. ‌శ్రీ జగన్‌తో పాటు కదులుతూ... కొందరు వెనుక పరుగులు పెడుతూ... వినుకొండ బహిరంగ సభకు చేరుకున్నారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి వాహన శ్రేణి వెళుతున్న ప్రతి దారిలో పలు గ్రామాల ప్రజలు ఆయనకు అడుగడుగునా స్వాగతం పలుకుతున్నారు. దీనితో కొద్ది దూరం చేరుకోవడానికి కూడా శ్రీ జగన్‌కు చాలా సమయం పడుతోంది. అంత ఎండలో సైతం ప్రజల ఉత్సాహానికి, తనపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ఆప్యాయతలకు జననేత కరిగిపోతున్నారు. మధ్యాహ్నపు మండుటెండలోనే శ్రీ జగన్ ప్రసం‌గించినా జనం కేరింతలు, హర్షధ్వానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో కనిపించబోయే శ్రీ జగన్ ప్రభంజనానికి‌ ఇదే సంకేతం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.‌ ‘మరి కొద్ది రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది. మీ జీవితాలు మారుతాయి’ అని శ్రీ జగన్ చెప్పినప్పుడు వినిపించిన హర్షాతిరేకాలు... రాష్ట్రంలో ఫ్యా‌న్ గాలిని ముందే చూపిస్తున్నాయంటున్నారు.

‘మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి మా జీవితాలను బాగుచేశారు. ఆయన రుణం ఎలాగూ తీర్చుకోలేకపోయాం. ఆయన వారసుడిగా వచ్చిన శ్రీ జగన్ కోసం కాసేపు ఎండను భరించలేమా?’ అని‌‌ శ్రీ జగన్ సభలు, రోడ్‌షోలకు వస్తున్న యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు వారిలో వారు మాట్లాడుకుంటున్నారు.
‘జగనన్న అంటే ప్రాణం. వైయస్ఆర్ పథకాల ద్వారా నేను బాగుపడ్డా. ఆయన చనిపోయాక జగనన్నలో ఆయన్ను చూసుకుంటున్నా. అందుకే రోడ్లన్నీ జనంతో నిండిపోయినా ఎలాగోలా వచ్చా. బిల్డింగ్ ఎక్కి ఆయన్ను చూశా. ప్రసంగం విన్నా. ఆయనకు షే‌క్‌హ్యాండ్ ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకోసారి ప్రయత్నిస్తా’‌ అని ఓ యువకుడు జవాబిచ్చాడు. జనాభిమానం మధ్య అందరినీ పలకరిస్తూ... కరచాలనాలు చేస్తూ... వారి సమస్యలు వింటూ... అవ్వా! మీ కష్టాలు తీరుస్తా... అని భరోసా ఇస్తూ శ్రీ జగన్ ముందుకు వెళుతున్నారు.

శ్రీమతి షర్మిల, విజయమ్మ సభల్లోనూ అదే తీరు :

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న రాజన్న బిడ్డ శ్రీమతి షర్మిలకూ, తూర్పుగోదావరిలో ప్రచారం చేస్తున్న శ్రీమతి వైయస్‌ విజయమ్మకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. అనపర్తి, రాజమండ్రిలలో శ్రీమతి విజయమ్మ రోడ్ షోలు, సభలకు జనం పోటెత్తారు. మధ్యాహ్నం ఎండల్లోనూ భారీగా తరలివచ్చారు.‌ శ్రీమతి షర్మిల ప్రచారంలో భాగంగా పాణ్యం, నందికొట్కూరు, శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల పరిధిలో పర్యటించారు. రాజన్న బిడ్డ వస్తోందని తెలిసి కర్నూలు, పాణ్యం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. శ్రీమతి షర్మిల ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ ఆమె హావభావాల్లో వైయస్ రాజశేఖర్‌రెడ్డిని గుర్తు చేసుకుని మురిసిపోయారు.

నందికొట్కూరులో ‌శ్రీమతి షర్మిల కార్యక్రమం లేకపోయినా ఆమె అటువైపుగా వెళ్తుండటం తెలిసి జనం భారీగా తరలివచ్చారు. ఆమె ప్రయాణిస్తున్న వాహనశ్రేణిని అడ్డుకుని ప్రసంగించాలని కోరడంతో.. వారి కోరికను అంగీకరించిన శ్రీమతి షర్మిల కాసేపు మాట్లాడారు. అక్కడి నుండి ఆత్మకూరుకు చేరుకున్నారు. మార్గమధ్యలో  పల్లె జనం రోడ్ల మీదకు వచ్చి బారులు తీరారు. ఆమెతో కరచాలనానికి పోటీపడ్డారు. పూలవర్షం కురిపిస్తూ అభిమానం చాటుకున్నారు. ఆత్మకూరులో భారీ జన సందోహం మధ్య ఆమె రాజశేఖరరెడ్డిని గుర్తు చేస్తూ ప్రసంగించారు. వెలుగోడులో అయితే జనసంద్రమే. కార్యక్రమం లేకపోయినా శ్రీమతి షర్మిల ప్రసంగించారు. అనంతరం నంద్యాలకు వెళ్తూ పల్లె ప్రజలను ఆత్మీయంగా పలకరించారు.

తాజా వీడియోలు

Back to Top