రాజమండ్రి)) గోదావరి పుష్కరాలు జరిగి ....క్షమించాలి... దీనిని గోదావరి పుష్కరాలు అనడం కన్న రాష్ట్ర సీఎం చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి 29మంది బలి... అంటే సరిగ్గా సరిపోతుంది. ఈ ఘోరానికి నేటికీ సరిగ్గా ఏడాది. వీఐపీ ఘాట్కు కాకుండా సామాన్యులు స్నానమాచరించే పుష్కర ఘాట్కు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబం తరలి వచ్చారు. సినిమా షూటింగులు చేసుకొంటూ గంటల కొద్దీ భక్తుల్ని బయట నిలిపివేశారు. చంద్రబాబు కుటుంబం వెళ్లాక ఒక్కసారిగా గేట్లు తెరిచారు. దీంతో ఒకేసారి లక్షలాది మంది భక్తులు ఘాట్లోకి పోటెత్తడంతో తోపులాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటు గోదావరి అంత్య పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. అయినా ఈ ఘోరానికి బాధ్యులను గుర్తించడంలో, చర్యలు తీసుకోవడంలో అధికార సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబే కారణం అని బహిరంగంగా తెలిసినప్పటికీ, ఇప్పటికీ ఎటువంటి చర్యలు లేనే లేవు.ఇప్పటికీ బాధ్యులెవరో తేలలేదు...సంఘటనపై పౌర సంఘాలు గొంతెత్తి నినదించిన మూడు నెలలకు ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్ 15న రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ సీవై సోమయాజులు కమిషన్ను విచారణకు నియమించింది. ఆ కమిషన్ ఇప్పటికీ బాధ్యులెవరో తేల్చలేదు. ఏపీ సీఎం చంద్రబాబు, ఇతర వీఐపీలు పుష్కరఘాట్లో గంటకు పైగా ఉండడంతోనే దుర్ఘటనకు కారణమని అప్పట్లో తూర్పుగోదావరి కలెక్టర్ రాష్ట్రపతికి, జాతీయ మానవహక్కుల కమిషన్కు నివేదించారు. అయితే ప్రభుత్వ ఒత్తిడితో నివేదికలో మార్పులు చోటుచేసుకున్నాయి. భక్తులు తోసుకురావడంతోనే ప్రమాదం జరిగిందని రెండోసారి నివేదికలో పేర్కొన్నారు. ఇలా పరస్పర విరుద్ధమైన నివేదికలివ్వడంలో ఆంతర్యమేమిటని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.సాక్ష్యాధారాలు ఉన్నా...పుష్కరాలకు అంతర్జాతీయ ప్రచారం కల్పించాలని ఒక ప్రైవేటు టీవీ ఛానెల్కు పుష్కరాల షూటింగ్ను కాంట్రాక్ట్ ఇచ్చిన చంద్రబాబు సర్కార్ భక్తుల ప్రాణాలను పణంగా పెట్టిందని ప్రతిపక్షాలు సాక్ష్యాలు చూపిస్తున్నాయి. ఆ దుర్ఘటనకు సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజీలను ప్రభుత్వం కావాలనే మాయం చేసిందని పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి.