అప్పు చేసి తప్పుకూడు

  • 2.26లక్షల కోట్ల బకాయిలు
  • 3 నెలల్లో 50 వేల కోట్లు
  • ఇప్పటికే 16,272 కోట్ల లోటుతో ఖజానా
  • తలసరి అప్పు 45000 
రాష్ట్రాన్ని దోచుకోవడంలో, రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడంలో, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తడంలో ఆంధ్రప్రదేశ్ సిఎమ్ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దేశంలోనే ముందు వరసలో నిలబెట్టాడు. పరిపాలనా దురంధరుడు అంటూ పచ్చపార్టీలు పతాక శీర్షికల్లో పొగిడే చంద్రబాబు రాష్ట్రానికి పట్టిస్తున్న గతి ఏమిటో ఆర్థిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దాంతో గుడ్లు తేలేసిన తోక పత్రికలు ఆర్థిక లోటుకు, అప్పుల పోటుకు కారణం కేంద్రం మొండి చేయి చూపించడమే అని సన్నాయి నొక్కులు మొదలు పెట్టింది. రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉంది అంటూ దీనమైన కథనాలు ప్రచురిస్తున్నా అందుకు అసలు కారకుడు చంద్రబాబే అని మాత్రం చెప్పడం లేదు. వాస్తవాలను ఎంత దాచాలనుకున్నా, అభివృద్ధి అంటూ అంకెల గారడీ చేయాలనుకున్నా అది ఎంతో కాలం సాగదు. నిజాలు వెల్లడించాల్సిన రోజు ఒకటి వస్తుంది. ఆర్థిక శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం ఆర్ బిఐ నుంచి అందినకాడికి అప్పులు తెచ్చి, విచ్చలవిడిగా ఖర్చులు చేసింది రాష్ట్రప్రభుత్వం. పోనీ ఈ ఖర్చులు ఆదాయం ఇచ్చే విభాగాల్లో కాకుండా, ఇష్టం వచ్చినట్టు టూర్లు, వివిధ కార్యక్రమాలకు వెచ్చించారు. ఈవెంట్ ల తరహాలో మీటింగులు చేయడం, ఏడాదికి రెండు మూడు సార్లు ముఖ్యమంత్రి, నేతలు ఇంకా అధికారులు సైతం విదేశీ పర్యటనలు చేయడం, హంగూ, ఆర్భాటాల కోసం ఖర్చులు చేయ]ం, విదేశీ సంస్థల సేవలకోసం కోట్ల రూపాయిల వెచ్చింపు ఇవన్నీ రాష్ట్ర ఖజానాను గుల్ల చేసాయి. జల హారతి అని, దోమలపై యుద్ధం అని, రాజధాని డిజైన్లు అని, నార్మన్ కంపెనీతో సంప్రదింపులకు విదేశాలకు ప్రయాణాలనీ ఇలా ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని చంద్రబాబు వాడుకున్న తీరు చూసి ప్రజలే కాదు, జాతీయ స్థాయి నాయకులు కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. అధిక ఖర్చుల విషయంలో నేషనల్ మీడియా సైతం చంద్రబాబు వ్యవహార శైలిని తప్పుపట్టింది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు ప్రభుత్వం 3నెలల్లో 50,000 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది 31,307 కోట్లు, అంతకు మందు ఏడాదిలో 6210 కోట్లు ఆర్ బి ఐ నుండి చేబదులుగా తెచ్చి వాడేసింది. ఈ ఏడాదిలో కేవలం వందరోజులకే 29,154 కోట్ల రూపాయల వేజ్ అండ్ మీన్స్ ను వాడేసుకుంది. వాస్తవ బడ్జెట్ వ్యయానికి ఈ చేబదుళ్లు అదనం. ఇలా ఇబ్బుడిముబ్బడిగా చేబదుళ్లు తీసుకోవడం, అప్పులను పెంచుకుంటూ పోవడం చేస్తే భవిష్యత్ లో తక్కువ వడ్డీకి అప్పు పుట్టదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రం కష్టకాలంలో ఉందని, పేద ముఖ్యమంత్రిని అని బీద అరుపులు అరుస్తూ, కల్లబొల్లి కన్నీరు కార్చే చంద్రబాబు తన అపరిమితమైన ఖర్చులతో రాష్ట్ర ఖజానాపై మోయలేని భారాన్ని మోపుతున్నారు. విజయవాడలో, విశాఖలో ఇతర ప్రాంతాల్లోనూ చంద్రబాబు పెట్టే సెమినార్లు, సమ్మెట్లు, వర్క్ షాపులకు కోట్ల రూపాయిలు మంచినీళ్లలా ఖర్చు అవుతున్నాయి. ఇక విదేశీ ప్రయాణాల మాట ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పెట్టుబడులు తెస్తానని ఘనంగా చెప్పుకుంటూ విదేశాలకు కుటుంబాలతో, అధికారులతో, మంత్రులతో ప్రత్యేక విమానాల్లో ప్రయాణించిన చంద్రబాబు రూపాయి పెట్టుబడిని కూడా రాష్ట్రానికి తెచ్చిందే లేదు. దేశంలోని ఏ ముఖ్యమంత్రీ ఈ రేంజ్ లో ఖర్చులు చేయలేదు. చంద్రబాబుకు సంబంధించిన ఎన్నో జివోలు రహస్యాలుగా ఉంటాయి. ప్రత్యేకించి భూముల కేటాయింపులకు సంబంధించిన జివోలు, చంద్రబాబు విదేశీ టూర్లు, విమాన ఖర్చులు, సిఎమ్ ఛాంబర్ల ఆధునీకరణ మొదలైన వాటికి సంబంధించిన జివోలను ప్రభుత్వం అతి రహస్యంగా ఉంచడంలోని మతలబు ఇదే. ఒక పక్క ఖజానా కటకట లాడుతుంటే విలాసాలకు, ప్రచారాలకు, ప్రకటనలకు కోట్ల రూపాయిలు వెచ్చించడం బాబు అధికార దుర్వినియోగానికి పరాకాష్ట.


 బాబు గారి దుబారా లెక్కలు మచ్చుకు కొన్ని:
ప్రమాణ స్వీకారానికి -50కోట్లు
అమరావతి భూమి పూజ – 50కోట్లు
శంకుస్థాపనకు – 400కోట్లు
సంకల్ప సభ కోసం – 50కోట్లు
పుష్కరాల షూటింగ్ కోసం 25కోట్లు
నివాసాలకు -42కోట్లు
చాంబర్ తయారీకి 10 కోట్లు
లేక్ వ్యూ అతిథిగృహంలో రిపేర్లకు 5కోట్లు
సిఎమ్ కాంప్ ఆఫీస్ ఏర్పాటుకు 16కోట్లు
సచివాలయంలో ఫర్నిచర్ మార్చినందుకు 10 కోట్లు
ఒక్క ఏడాదికే ఢిల్లీ పర్యటనలకు 24కోట్లు
మందీ మార్బలంతో సింగపూర్ ప్రయాణానికి – 35కోట్లు
జపాన్ కు రెండు దఫాల పర్యటనకు – 25కోట్లు
జలహారతి – 5కోట్లు
పైన చెప్పిన వివరాలు కొన్ని మాత్రమే. బాబు గత మూడేళ్లలో చేసిన దురాబా చెప్పాలంటే రాష్ట్ర బడ్జెట్ చెప్పడానికి పట్టినంత సమయం పడుతుంది.


తాజా వీడియోలు

Back to Top