రైతుల సాగునీటి పోరుపై పోలీసు కేసులు

ఉరవకొండలో మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు 18 మందిపై కేసు

అనంతపురం జిల్లా: ఉరవకొండలో రైతుల సాగునీటి హక్కుల కోసం నిర్వహించిన ఆందోళనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. హెచ్‌ఎల్‌సీ, జీబీసీ, హంద్రీనీవా ప్రాజెక్టులకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనకు సంబంధించి వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో పాటు మొత్తం 18 మందిపై ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్‌ 157/2026గా కేసు నమోదైంది. బీఎన్‌ఎస్‌, ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.

రైతులకు సాగునీరు అందించాలని శాంతియుతంగా నిర్వహించిన నిరసనపై కేసులు పెట్టడం అన్యాయమని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు పేర్కొన్నారు. రైతుల సమస్యలపై ప్రశ్నించినందుకే అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసులు నమోదు చేశారని ఆరోపించారు. రైతుల పొలాలకు సాగునీరు అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని, కేసులకు భయపడి రైతుల సమస్యలపై వెనక్కి తగ్గేది లేదని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.
 

Back to Top