బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు బుద్ధి చెబుదాం


గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు బుద్ధి చెబుదామ‌ని వైయ‌స్ఆర్ సీపీ సీనియ‌ర్ నాయ‌కులు వైవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. అందులో భాగంగానే పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇవాళ జ‌రుగుతున్న రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థులు ఈ రెండు పార్టీల అభ్య‌ర్థుల‌కు ఓటు వేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెప్పారు. గురువారం గుంటూరులో ఏర్పాటు చేసిన వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష‌లో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంద‌న్నారు. ఇప్పటికే వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా యువభేరిలు, నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు, రిలే దీక్షలు, వంటా వార్పులు ఇలా అనేక రకాల ఉద్యమాలతో పోరాటం సాగించామ‌న్నారు.   పార్ల‌మెంట్ లోప‌ల‌, బ‌య‌ట ప్ర‌తిసారి స‌మావేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీశామ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్  ఇదే గుంటూరులో 2015లో 8 రోజుల పాటు ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టార‌ని గుర్తు చేశారు.చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వైయ‌స్ జ‌గ‌న్ దీక్ష‌ను భ‌గ్నం చేసింద‌న్నారు. 2016లో కేంద్రం ప్ర‌త్యేక హోదాకు బ‌దులు ప్యాకేజీ ఇస్తామంటే చంద్ర‌బాబు స్వాగ‌తించి, అసెంబ్లీలో ధ‌న్య‌వాద తీర్మానం చేసి అన్యాయం చేశార‌న్నారు.  చివ‌రి బ‌డ్జెట్ స‌మావేశాల్లో మొద‌టి రోజు నుంచి కేంద్రం పై పోరాటం చేశామ‌ని, ఐదు కోట్ల ఆంధ్రుల‌కు చేస్తున్న అన్యాయాల‌ను ఢిల్లీ వేదిక‌గా దేశ‌వ్యాప్తంగా తెలియ‌జేయాల‌ని మొట్ట‌మొద‌టిసారిగా కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టింది వైయ‌స్ఆర్‌సీపీనే అన్నారు. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా ఏవిధంగా అడ్డుకున్నారో అంద‌రూ చూశార‌న్నారు. ముందుగా ప్ర‌క‌టించిన మేర‌కు రాష్ట్రానికి జ‌రుగుతున్న అన్యాయానికి నిర‌స‌న‌గా వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన ఐదుగురు ఎంపీలం ప‌ద‌వుల‌కు రాజీనామా చేసి, ప్రాణాల‌కు తెగించి ఆమ‌ర‌ణ దీక్ష చేప‌ట్టామ‌న్నారు. రాష్ట్రానికి చెందిన అంద‌రూ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ప్ర‌త్యేక హోదా వ‌చ్చేద‌న్నారు. మేం రాజీనామా చేసి పోరాటం చేస్తుంటే..టీడీపీ ఎంపీలు పారిపోయార‌న్నారు. టీడీపీ యూట‌ర్న్ తీసుకుని హోదా కోసం పోరాటం చేస్తున్న‌ట్లు డ్రామాలాడుతున్నార‌ని మండిప‌డ్డారు. హోదా సాధ‌న వైయ‌స్ జ‌గ‌న్‌తోనే సాధ్య‌మ‌వుతుంద‌ని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top