మంత్రి నారా లోకేష్‌ తక్షణమే పదవికి రాజీనామా చేయాలి 

వైయ‌స్ఆర్‌సీపీ నేతల డిమాండ్ 

నీట్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాలపై తలెత్తిన ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నైతిక బాధ్యత వహించాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. 

తాడేపల్లి: నీట్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా యువత ఆందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసినట్లుగానే, రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్న అవకతవకలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నేతలు డిమాండ్‌ చేశారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్‌ ఎప్పుడు రాజీనామా చేస్తారు? అంటూ రాష్ట్ర యువత ప్రశ్నిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.

వివిధ ప్రాంతాల్లో వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఏమన్నారంటే.. 

- డీఎస్సీ దగాకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ రాజీనామా చేయాలి: గుడివాడ అమర్నాథ్‌, మాజీ మంత్రి 

నిరుద్యోగుల ఆశలతో చెలగాటమాడుతూ డీఎస్సీ నియామకాలను వివాదాలమయం చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఇక తప్పించుకోలేరు. లక్షలాది మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ముడిపడిన నియామక ప్రక్రియలో అవకతవకల ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు విద్యాశాఖ మంత్రిగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత లోకేష్‌పై లేదా? డీఎస్సీలో జరిగిన అవకతవకలకు బాధ్యులెవరు? అభ్యర్థులకు న్యాయం చేసేది ఎవరు? లోకేష్‌ ఇంకా మంత్రి పదవిలో ఎందుకు కొనసాగుతున్నారు? రాష్ట్ర నిరుద్యోగ యువత అడుగుతున్న ఈ ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను బయటపెట్టాలి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.

- ఎన్డీఏలో ఒక న్యాయం.. ఏపీలో మరో న్యాయమా?: పేట్ల ఉమాశంకర్‌ గణేష్‌, నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే 

నీట్‌ అక్రమాలు ఎంత తీవ్రమైనవో, లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్తుతో ముడిపడిన డీఎస్సీ అక్రమాల ఆరోపణలు కూడా అంతే తీవ్రమైనవి. డీఎస్సీలో జరిగిన అక్రమాలను శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా చంద్రబాబు, లోకేష్‌ స్పందించడం లేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి టాప్‌ ర్యాంక్‌, స్పోర్ట్స్‌ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు ఉన్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదు? డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి.

- మెగా డీఎస్సీని దగా డీఎస్సీగా మార్చారు: బింగి హరికిరణ్‌రెడ్డి, విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి 

మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతను దగా చేసింది. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి కష్టపడిన అభ్యర్థుల కలలను ఛిద్రం చేసింది. డీఎస్సీలో జరిగిన అవకతవకలను శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో బయటపెట్టినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మౌనం వీడటం లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణకు సిద్ధపడాలి. యువత రోడ్డెక్కే పరిస్థితి రాకముందే నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ విద్యాశాఖ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలి.

- డీఎస్సీ ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలి: మద్దూరు సుభాష్‌ చంద్రబోస్‌, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి 

డీఎస్సీ పరీక్షల్లో పేపర్‌ లీక్‌ సహా తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించకపోవడం దారుణం. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ముడిపడిన ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ విచారణ జరిపించాలి. లోకేష్‌కు ఏమాత్రం నైతికత ఉన్నా విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసి, డీఎస్సీ వ్యవహారంలోని వాస్తవాలను ప్రజల ముందుంచాలి.

- కేంద్రంలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా?: బెందాళం పద్మావతి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి 

డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకల ఆరోపణలు వచ్చినా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ మౌనం వీడకపోవడం దారుణం. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి స్టేట్‌ టాప్‌ ర్యాంక్‌ రావడం, ఆ తర్వాత ఆ డేటా తొలగించడం, స్పోర్ట్స్‌ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు వచ్చినట్లు ఆరోపణలు రావడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో ప్రశ్నించినా చంద్రబాబు, లోకేష్‌ ఎందుకు స్పందించడం లేదు? డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలంటే సీబీఐ దర్యాప్తు జరిపించాలి. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ తక్షణమే విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలి.

- చంద్రబాబు, లోకేష్‌ స్పందించకపోవడం దారుణం: తాలే రాజేష్‌, వైయ‌స్ఆర్‌సీపీ రాజాం నియోజకవర్గ సమన్వయకర్త 

డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ ఆధారాలు బయటపెట్టినా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించకపోవడం దారుణం. నిబంధనల మార్పు, స్పోర్ట్స్‌ కోటా నియామకాలు, విద్యాశాఖలో పనిచేసే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ రావడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలి. నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్‌ తక్షణమే రాజీనామా చేయాలి.

- యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ప్రభుత్వానికి లేదు: చిర్ల జగ్గిరెడ్డి, కొత్తపేట మాజీ ఎమ్మెల్యే 

డీఎస్సీ నియామకాల్లో తీవ్ర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి. స్పోర్ట్స్‌ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు, విద్యాశాఖ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగికి స్టేట్‌ ఫస్ట్‌ ర్యాంక్‌, నిబంధనలను మార్చి నియామకాలు చేపట్టారన్న అంశాలపై వాస్తవాలను బయటపెట్టాలి. యువత భవిష్యత్తుతో చెలగాటమాడే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించి, నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్‌ తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలి.

Back to Top