కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి



గుంటూరు: పార్టీ కోసం కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో జరిగే ప్రతి రాజకీయ పరిణామాన్ని నాయకుల దృష్టికి తీసుకురావాలన్నారు. గుంటూరు జిల్లాలో పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్ల శిక్షణ తరగతులు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బొత్ససత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపీ వరప్రసాద్‌ తదితరులు జ్యోతిప్రజ్వళన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థలను చంద్రబాబు ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. నీరు–చెట్టు పేరుతో మట్టిని దోచుకుంటున్నారని ఎంపీ వరప్రసాద్‌ ఆరోపించారు. 

ప్రజాస్వామ్యం అపహాస్యం: బొత్స
చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను చేతుల్లోకి తీసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్థానికంగా జరుగుతున్న అక్రమాలను కార్యకర్తలు అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నాయకుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు. బూత్‌ లెవల్‌లో కష్టపడే వారిని పార్టీ ఎప్పుటికీ మర్చిపోదన్నారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు మోపిదేవి వెంకటరమణ, కోన రఘుపతి, నందిగం సురేష్, మేరుగ నాగార్జున, తదితరులు పాల్గొన్నారు.
 
Back to Top