కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఇవాళ కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలోకి అడుగుపెట్టింది. 11వ రోజు పాదయాత్రను వైయస్ జగన్ దొర్నిపాడు మండలంలో ప్రారంభించి ఆ తరువాత బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల మండలం కంపమల్ల మెట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జ్ శిల్పా చక్రపాణిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు జననేతకు ఘన స్వాగతం పలికారు. మహిళలు పూలవర్షం కురిపించారు. మార్గమధ్యలో వ్యవసాయ కూలీలను కలిసన వైయస్ జగన్ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాజన్న బిడ్డతో కరచాలనం చేసేందుకు, పోటోలో దిగేందుకు యువత పోటీ పడ్డారు. దారి పొడువున జనమే జనం. జననేతతో వేలాది మంది అడుగులు వేయగా ఆయన ముందుకు కదిలారు. ఇవాళ వైయస్ జగన్ పాదయాత్ర ఉయ్యాలవాడ క్రాస్ రోడ్ మీదుగా భీమునిపాడు వద్దకు కొనసాగుతుంది. అక్కడ పార్టీ జెండా ఆవిష్కరణ తర్వాత భోజన విరామం తీసుకుని తర్వాత వైయస్ జగన్ యాత్ర కొనసాగిస్తారు. పెరా బిల్డింగ్స్, కోవెలకుంట్ల, కోవెలకుంట్ల బస్టాండ్ సెంటర్ మీదుగా సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వయా కర్రా సుబ్బారెడ్డి విగ్రహాం వద్దకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది. అక్కడే ఆయన రాత్రి బస చేస్తారు.<br/>