విద్యుత్ కోతలకు నిరసనగా 31న రాష్ట్ర బంద్

హైదరాబాద్, 26 ఆగస్టు 2012: రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న విద్యుత్ కోతలకు, విద్యుత్­ దుస్థితిని చక్కదిద్దే విషయంలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్ననిర్లక్ష్య వైఖరికి నిరసనగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 28, 29, 30 తేదీల్లో మండలస్థాయి నిరసనలు, 31న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. కరెంటు కోతలపై ఇప్పటికే పార్టీ శ్రేణులు గ్రామస్థాయి నుంచి నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వంలో చలనం రావడంలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ సీజీసీ సభ్యుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు ప్రకటించారు. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అడ్డూ అదుపులేని కరెంటు కోతలతో వ్యవసాయం, నేత, పారిశ్రామిక రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ అసమర్థత కారణంగా పలు పరిశ్రమలు మూతపడాల్సి వస్తోందని, ఫలితంగా వాటిల్లో పనిచేసే కార్మికులు రోడ్డున పడే దుస్థితి తలెత్తిందన్నారు. అయినా సిగ్గులేని ప్రభుత్వం విద్యుత్ కోతలు విధించడమే కాకుండా, చార్జీలు కూడా పెంచుతోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల ఆందోళనకు ప్రతీకగా మూడు రోజులపాటు విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడి, ప్రభుత్వ కార్యాలయాలకు కరెంటు సరఫరా నిలిపివేయించడంతో పాటు ధర్నాలు, రాస్తారోకోల రూపంలో తీవ్ర నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. తరువాత ఈనెల 31న రాష్ట్ర బంద్‌కు పిలుపిస్తున్నామని వివరించారు..

Back to Top