<strong>ఏలూరు :</strong> రాష్ట్రంలోని రైతులందరూ వైయస్ఆర్ కాంగ్రెస్ వైపే ఉన్నారని, అత్యధిక సహకార సొసైటీలను పార్టీయే కైవసం చేసుకుంటుందని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తే ప్రస్తుత కిరణ్ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు బిగిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇలాంటి రైతు, ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం నుంచి విముక్తి పొందాలంటే శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆ దిశగా రైతులంతా వైయస్ఆర్సిపికి మద్దతు పలికి పార్టీ బలపర్చిన అభ్యర్థులను సహకార ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. మరో తొమ్మిది నెలల్లో శ్రీ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం కూచింపూడి, రాయన్నపాలెం, పెదవేగిలో మంగళవారం ఆయన సొసైటీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.<br/>ఈ సందర్భంగా నాని కూచింపూడిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ, రైతులు తీసుకునే ఒక మంచి నిర్ణయమే మహానేత వైయస్ఆర్ అందించిన స్వర్ణయుగానికి మళ్ళీ నాంది పలుకుతుందని నాని అన్నారు. మహానేత ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని విమర్శించారు. పేదల పక్షాన పోరాడుతున్న శ్రీ జగన్మోహన్రెడ్డిని జైలు పాలు చేసిందని ఆరోపించారు. సొసైటీ ఎన్నికల్లో కుట్రలు చేసేందుకు కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.