<strong>- వైయస్ జగన్కు బనగానపల్లె నియోజకవర్గంలో బ్రహ్మరథం</strong><strong>- ఉత్సాహంగా సాగుతున్న ప్రజా సంకల్ప యాత్ర</strong><strong>- దారి పొడవునా సమస్యలు వింటున్న జననేత</strong><br/>కర్నూలు: ప్రజా సమస్యలు తెలుసునేందుకు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా పాదయాత్రగా బయలుదేరిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి అవిశ్రాంతంగా ముందుకు సాగుతున్నారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ..అలుపు ఎరుగకుండా ప్రజల మధ్య ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. జననేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో సాగుతోంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డికి జిల్లా ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. ఊరూరా నీరాజనాలు పలుకుతున్నారు. అన్నవస్తున్నాడంటూ జేజేలు కొడుతున్నారు. పాదయాత్రలో భాగంగా 12వ రోజు బనగానపల్లె నియోజకవర్గంలోని సౌదరదిన్నె నుంచి ఈ ఉదయం యాత్ర కొనసాగించిన రాజన్న తనయుడి కోసం జనం భారీగా తరలివచ్చారు. ఆమదాల క్రాస్ రోడ్డు, గులాంనబీ పేట-బొందల దిన్నెక్రాస్ రోడ్డు, ఎల్లురి కొత్తపేట మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా ప్రజల సమస్యలు వింటూ, అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.<br/><strong>వినతుల వెల్లువ</strong>ప్రజా సంకల్ప యాత్ర ద్వారా తమ గ్రామానికి వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజలు తమ బాధలు చెప్పుకుంటున్నారు. టీచర్లు, 108, 104 ఉద్యోగులు వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు. సమస్యల పరిష్కారానికి సహకారం అందించాలని అభ్యర్థించారు. తన వంతు ప్రయత్నం చేస్తానని ప్రతిపక్ష నేత వారికి హామీయిచ్చారు. వృద్ధులు, దివ్యాంగులను ఆప్యాయంగా పలకరించి వారి సమస్యలు పరిష్కరిస్తానని జననేత హామీయివ్వడంతో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని ఆలిండియా బంజారా సేవా సంఘం ప్రతినిధులు.. వైయస్ జగన్ను కలిసి వాపోయారు. గిరిపుత్రిక పథకం కింద వివాహాలకు రూ.50 వేలు ఇస్తామని మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక గిరిజనులకు న్యాయం చేస్తామని జగన్ మాట ఇచ్చారు.<br/><br/>