కాకినాడ: పోలవరం నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వమే చేపట్టాలని వైయస్ఆర్ సీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. పోలవరం ముంపు బాధితుల పరిహారం పెంపుపై కాకినాడలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ... జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతుందని మండిపడ్డారు. తన బినామీలకు కాంట్రాక్ట్లు కట్టబెట్టిన చంద్రబాబు కమీషన్ల కోసమే ఈ ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించడం లేదన్నారు. <br/>పోలవరం నిర్మాణ సంస్థలపై దృష్టి సారించిన ప్రభుత్వం ...నిర్వాసితుల పరిహారంపై ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలపై రీసర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విభజన చట్టంలో లేదంటున్న కేంద్రం, చట్టంలో లేనివిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అప్పగించిందని కన్నబాబు నిలదీశారు. <br/>