విజయనగరం ) ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని టీడీపీ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే తాము సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే పీడిగ రాజన్నదొర తెలిపారు. చెట్టుపేరు చెప్పుకొని కాయలమ్ముకున్న చందంగా టీడీపీ నాయకులు ఎన్టీఆర్ పేరు చెప్పుకొని కాలం వెళ్లదీస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేశామని చెప్పగలరా? అని సవాల్ విసిరారు. మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేయడం లేదని, అర్హులైన వారికి ఫించన్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇంటికో ఉద్యోగమని చెప్పి నేడు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పి బడ్జెట్లో పైసా కూడా కేటాయించలేదని ఆరోపించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టామన్నారు.