నీతులు వల్లిస్తున్న చంద్రబాబు!

మంగళగిరి (గుంటూరు జిల్లా)

: చంద్రబాబు నాయుడు నీతి, నిజాయితీల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ఐఎంజీ, ఎమ్మార్‌లకు హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన వందలాది ఎకరాలను పప్పుబెల్లాల్లా కట్టబెట్టిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అతిచౌకగా తన బినామీలకు అప్పగించడం, ప్రభుత్వ డైరీలను కుప్పకూల్చి, సొంత హెరిటేజ్‌ సంస్థను విస్తరించడం రాష్ట్రప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. చంద్రబాబు నాయుడు అవినీతి చక్రవర్తి అని విరుచుకుపడ్డారు. గుంటూరుజిల్లా మంగళగిరిలో మంగళవారం జరిగిన ‌'వైయస్ఆర్ జనభేరి' ఎన్నికల బహిరంగ సభలో శ్రీ జగన్ ప్రసంగించారు.

‌మాట మీద నిలబడే నైజం బాబుకు లేదు :
'రాజకీయాలంటే చంద్రబాబుకు ఎత్తులు, పైఎత్తులు, కుట్రలు, కుతంత్రాలు మాత్రమే. సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు నాలుగేళ్లుగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తలకెత్తుకుని మోస్తున్నారు. అధికార కాంగ్రెస్‌తో కలిసి నాపై కోర్టులో కేసులు వేశారు. రాష్ట్రంలో కిరణ్ ప్రభుత్వం రూ.32 వేల కోట్లు కరెంటు చార్జీ‌ల భారం మోపితే తన ఎమ్మెల్యేలకు విప్ జారీచేసి మరీ ఆ ప్రభుత్వాన్ని అవిశ్వాసం నుంచి కాపాడారు. చిన్న చిన్న వర్తకులను దెబ్బతీసే ‘ఎఫ్‌డీఐ’ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల) బిల్లును గట్టెక్కించేందుకు రాజ్యసభలో తన సభ్యులను గైర్హాజరు చేయించారు' అని శ్రీ జగన్‌ తూర్పారపట్టారు.

'అడుగడుగునా అధికార పార్టీకి అండదండలు అందించారు కాబట్టే చంద్రబాబును సీబీఐ విచారించదు. ఎమ్మా‌ర్ అక్రమాలపై‌ సీబీఐ విచారణ చేస్తుంది కానీ అందులో చంద్రబాబు పాత్రను మాత్రం ప్రస్తావించదు. కనీసం మంత్రివర్గంలో చర్చించకుండా ఊరూపేరూ లేని ఐఎంజీకి వందలాది ఎకరాలు ధారాదత్తం చేసిన వైనంపై చంద్రబాబును విచారించాలని కోరితే... తమ వద్ద తగిన సిబ్బంది లేరని సమాధానం చెపుతుంది. అధికార పార్టీని ధిక్కరించి సొంత పార్టీ స్థాపించాను కాబట్టి నాపై కక్ష సాధిస్తుంది. నా ఆఫీసుల్లో అర్ధరాత్రి సోదాలు చేస్తుంది. చంద్రబాబుకు ఒక న్యాయం.. జగన్మోహన్‌రెడ్డికి ఒక న్యాయం. ఎందుకంటే జగన్మోహన్‌రెడ్డి సోనియాను ఎదిరించాడు.. చంద్రబాబు కుమ్మక్కయ్యాడు’ అని శ్రీ వైయస్‌ జగన్ చెప్పారు.

‌ఈ కుమ్మక్కు రాజకీయాలకు చరమగీతం పాడే రోజు 15 రోజుల్లో వస్తుందని శ్రీ జగన్ చెప్పారు. ఆ రోజున విశ్వసనీయతకు ఓటేసి మన తలరాతలు మార్చుకోవాలని ప్రజలకు‌ ఆయన పిలుపునిచ్చారు.

బంగారం లాంటి రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారు :
'ఓట్లు, సీట్ల కోసం సోనియాతో కుమ్మక్కయిన చంద్రబాబు బంగారం లాంటి మన రాష్ట్రాన్ని అడ్డగోలుగా చీల్చారు. సమైక్య రాష్ట్రం కోసం నేను జైలులోనే నిరాహార దీక్ష చేసి ఉద్యమిస్తే.. చంద్రబాబు మాత్రం పార్లమెంటులో తన సభ్యులతో కాంగ్రెస్‌కు మద్దతు పలికించి రాష్ట్ర విభజనకు పాల్పడ్డారు. ఓట్లు, సీట్ల కోసం ఎంతటి నీచానికైనా పాల్పడే మనస్తత్వం చంద్రబాబుది. అందుకోసం ఇప్పుడు మరిన్ని వాగ్దానాలతో మీ ముందుకు వస్తున్నారు. రోజుకో అబద్ధం చెబుతూ.. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు రాజకీయం అంటే ఓ చదరంగం, ఓ కుట్ర' అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి తూర్పారపట్టారు.

'కానీ రాజకీయం అంటే పేదవాని మనసెరిగి ప్రవర్తించడం.. పేదవాడి గుండెచప్పుడు వినడం.. చనిపోయాక కూడా పేదవాని గుండెల్లో సజీవంగా ఉండటం.. ఇదీ నేను మా నాయన దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి నుంచి నేర్చుకున్న విలువ. మా నాయన నుంచి నాకు వారసత్వంగా వచ్చిందేమైనా ఉందంటే అది ‘విశ్వసనీయతే’. రాజకీయాల్లో ఇచ్చిన మాటపైన నిలబడటం.. మాట‌ కోసం ఎందాకైనా పోరాడటం అన్న విలువలు ఆయన నుంచే నేర్చుకున్నాను' అన్నారు.

'ఎన్నికల ముందు చంద్రబాబు రెండు రూపాయలకు కిలో బియ్యం అన్నారు.. ఎన్నికలయ్యాక రూ.5.25 చేశారు. ఎన్నికల ముందు మద్యనిషేధం అన్నారు.. ఆ తర్వాత ‘ఈనాడు’లో పెద్ద పెద్ద వార్తలు రాయించి.. నిషేధం ఎత్తేసి ఊరూరా బెల్టు షాపులు తెరిపించారు.చంద్రబాబు పాలనలో ఏ గ్రామానికి వెళ్లి చూసినా భయానక దృశ్యాలే. పెద్ద జబ్బు చేస్తే ఆస్పత్రి ఖర్చుల కోసం నాలుగైదు రూపాయల వడ్డీ అయినా చెల్లించేందుకు తిప్పలు పడే దృశ్యాలు ఇప్పటికీ వెన్నాడుతూనే ఉంటాయి. పిల్లల ఫీజుల కోసం అన్నీ అమ్ముకునే పేద తల్లిదండ్రులు.. పింఛన్ కోసం... ఒక వృద్ధుని చావు కోసం మరో వృద్ధుడు ఎదురుచూసే అమానవీయ పరిస్థితి మనసును కలచివేస్తూనే ఉంటుంది' అని ఆవేదన వ్యక్తం చేశారు.

'ముఖ్యమంత్రిగా పేదలకు నరకం చూపిన చంద్రబాబు ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటూ మీ ముందుకు వస్తున్నారు. ఓట్లు, సీట్ల కోసం నేను చంద్రబాబులా అబద్ధాలు చెప్పను. ఈ ఎన్నికల అనంతరం తాను, తన పార్టీ ఉండబోమని 65 ఏళ్ల చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే అడ్డగోలు హామీలిస్తున్నారు. చంద్రబాబుకన్నా నేను పాతికేళ్లు చిన్నవాడిని. మరో 30 ఏళ్లు ప్రజల మధ్య ఉండి రాజకీయాలు చేసేవాడిని. అందుకే చేసే పనులే చెప్తా. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు సంతకాలు చేస్తానని ఇప్పటికే పలు సభల్లో చెప్పాను. అధికారంలోకి వచ్చాక చేసే పనుల గురించి పలు సందర్భాల్లో ఇప్పటికే పలు సభల్లో వివరించా. నేనిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా. 15 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల సమరంలో కుట్రలు, కుతంత్రాలను ఓడించండి. విశ్వసనీయతకు పట్ట కట్టండి. ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైయస్ఆర్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి' అని ఓటర్లకు శ్రీ వైయస్‌ జగన్‌ విజ్ఞప్తిచేశారు.

Back to Top